Andhra BJP: ఆంధ్రప్రదేశ్‌లో రూలింగ్ కాదు ట్రేడింగ్ జరుగుతోంది..సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్‌లో రూలింగ్ కాదు ట్రేడింగ్ జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు.

  • Written By:
  • Publish Date - September 18, 2022 / 07:00 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో రూలింగ్ కాదు ట్రేడింగ్ జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. విశాఖపట్నం నుంచి రాజాపూర్ బస్సు యాత్రను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారమయంగా మారిందని సోము వీర్రాజు అన్నారు. కుటుంబ పార్టీలు, దిశ దశ లేకుండా పాలన చేస్తున్నాయని విమర్శించారు. రెండు కుటుంబ పార్టీలు బీజేపీతో దోబూచులాడుతున్నాయని, డ్రామాలాడుతున్నాయని అన్నారు. 2024లో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్‌కు రాజధాని ఉందా? అని ప్రశ్నించారు. మూడు రాజధానులు అంటున్నారని, వాల్తేర్ క్లబ్, బే పార్క్, రాజధానా? అని ప్రశ్నించారు. భూములిచ్చిన రైతులను రోడ్డుమీద పడేశారని మండిపడ్డారు. దీనికి ఎవరు బాధ్యులని అడిగారు.

గత ప్రభుత్వం రాజధాని కట్టలేదని, ఈ ప్రభుత్వం పని చేయలేదని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారని, వైసీపీ, టీడీపీలు వాష్ అవుట్ అవుతాయని జోస్యం చెప్పారు. పోలవరంపై విమర్శలు చేసిన వైసీపీ ఇప్పుడు ఏం చేస్తుందో చెప్పాలన్నారు. మూడేళ్లలో విశాఖపట్నంలో ఏం చేశారో చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. విశాఖ మొదలుకొని ఐదు వేల ప్రజా పోరు సభలను నిర్వహించనున్నట్లు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఎమ్మెల్సీ మాధవ్, విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.