రాజధాని అమరావతి విషయంలో రైతులు 700 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ఏ మంత్రి కూడా చర్చలు జరిపేందుకు ప్రయత్నించలేదని బీజేపీ ఆరోపించింది. అమరావతి రాజధానికి కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్న రైతులకు న్యాయం చేసేందుకు వైసీపీ కార్యచరణ ప్రణాళికను ప్రకటించి అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.
రైతులు చేస్తున్న ఆందోళనలకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు మాట్లాడుతూ అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రలో పార్టీ నేతలు ఆదివారం పాల్గొంటారని తెలిపారు. అమరావతి అభివృద్ధికి చురుగ్గా పనిచేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని, ఎయిమ్స్, మంగళగిరి, విజయవాడలో ఫ్లైఓవర్ల నిర్మాణం, కృష్ణానదిపై వంతెన, రాజధానికి ఎక్స్ప్రెస్వే తదితరాల నిర్మాణం పార్టీ అభివృద్దికి నిదర్శనమన్నారు. మహా పాదయాత్రకు ఇప్పటికే పార్టీ అధినేత సోము వీర్రాజు సంపూర్ణ మద్దతు తెలిపారని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఏర్పాటు చేయాల్సిన కేంద్ర సంస్థలన్నీ రాజధాని ప్రాంతంలోనే ఏర్పాటవుతున్నాయని సూర్యనారాయణరాజు పేర్కొన్నారు.
అయితే బీజేపీ నేతులు రైతులు మహాపాదయాత్రలో పాల్గొడటంతో ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చనుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు రైతులకు మద్ధతు ఇస్తుండటంతో భవిష్యత్ లో అమరావతే రాజధానిగా కొనసాగుతుందనే భావనలో రైతులు వచ్చారు. ఇప్పటి వరకు బీజేపీ రాజధాని విషయంలో ధ్వంద వైఖరి అవలంభించింది. కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. అయితే బీజేపీలో తరువాత జరిగిన పరిణామాల వల్ల కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు వచ్చారు. వీర్రాజు వచ్చాక రైతుల ఉద్యమానికి మద్దతు కరువైంది.దీంతో రాజధాని ప్రాంతంలో బీజేపీపై వ్యతిరేకత మొదలైంది. అయితే రాష్ట్ర నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కేంద్ర నాయకత్వం నిశితంగా పరిశీలించింది. చివరకు ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను తమవైపు తిప్పుకోవడంలో విఫలమైయ్యారనే భావనలో కేంద్ర నాయకత్వం వచ్చింది. దీంతో అమిత్ షా రాష్ట్ర నాయకులకు క్లాస్ పీకారు. అమరావతి ఉద్యమానికి మద్దతు ఇచ్చి పాదయాత్రలో పాల్గొన్నాలని చెప్పడంతో బీజేపీ రాష్ట్ర నాయకులు ఉద్యమం బాట పట్టనున్నారు.