టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్పై ఏపీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. జగన్ మాస్టర్ ప్లాన్ తో చంద్రబాబును అరెస్ట్ చేసి ప్రజలను డైవర్ట్ చేశారని ఆయన ఆరోపించారు. దేశంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జీ20 సదస్సు చూసే భాగ్యం జగన్ కలిగించలేదని ఆయన వాపోయారు. లోకేశ్ పాదయాత్రకు అడ్డుకట్ట వేసేలా జగన్ మాస్టర్ ప్లాన్ వేశారని.. ప్రజలు ఆశ్చర్యపరిచేలా జడ్జి తీర్పు ఇచ్చారన్నారు. చంద్రబాబును రిమాండ్కు ఇవ్వడంపై జడ్జి మీద శాఖాపరమైన విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు రిమాండ్ తో వైసీపీ వాళ్లు టపాసులు కాల్చి స్వీట్లు పంచుకోవడం సైకోయిజమేనని.. సీఐడీ ఈ స్కామ్ లో అధికారులను ఎందుకు చేర్చలేదని ఆయన ప్రశ్నించారు. జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని.. ఎంపీ రాఘురామకృష్ణ రాజుని ఖతం చేయాలని జగన్ చూశారని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. 2014 తర్వాత జగన్ లా టీడీపీ, బీజేపీ ఆలోచన చేస్తే వైసీపీ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించేకోవాలన్నారు. చంద్రబాబుకు జైలులో ప్రాణహాని ఉందని.. హౌస్ అరెస్ట్ చేసి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ సంపాదనపై విచారణ జరిపిస్తే ప్రపంచం నివ్వెరపోయేలా ఆస్తులు బయటపడతాయని..వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 25 కంటే ఎక్కువ సీట్లు రావని జోస్యం చెప్పారు.