ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార ప్రతిపక్షపార్టీల్లో టికెట్ల కోసం నేతలు పాట్లు పడుతున్నారు. టికెట్ రాని నేతలంతా పక్క చూపులు చూస్తున్నారు. ప్రధానంగా అధికార పార్టీలో టికెట్ల లొల్లి కొనసాగుతుంది. ఇప్పటికే చాలా చోట్ల కొత్త వారిని తెరమీదకు వైసీపీ అధిష్టానం తీసుకువచ్చింది. వచ్చే ఎన్నికల్లో వారే పోటీ చేస్తారంటూ ప్రకటనలు చేస్తుంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంతా ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీ, జనసేనలో చేరిపోయారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా జనసేనలో చేరేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. వీరిలో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఉన్నారు. మద్దిశెట్టి వేణుగోపాల్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఈ సారి అవకాశం కల్పిండంతో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దీంతో వైసీపీని వీడి జనసేనలో చేరేందుకు ఆయన సిద్ధమైయ్యారు. ఇటు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్యకు కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని చెప్పడంతో ఆయన కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో కూడా పలువురు ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కి టికెట్ ఇవ్వరనే ప్రచారం జరగుతుండటంతో ఆయన కూడా జనసేన వైపు చూస్తున్నారని క్యాడర్లో చర్చ జరగుతుంది. ఇటు మైలవరం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్థానంలో తిరుపతిరావుని ఇంఛార్జ్గా నియమించారు. దీంతో వసంత కూడా త్వరలో టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది.
Also Read: IAS Amrapali : ఐఏఎస్ ఆమ్రపాలికి మరిన్ని కీలక బాధ్యతలు.. ఆమె నేపథ్యమిదీ..