Bharati Cements : జగన్ అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్కు చెందిన రూ.150 కోట్ల ఎఫ్డీ మొత్తాన్ని విడుదల చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను ఆదేశిస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దీంతో భారతీ సిమెంట్స్కు(Bharati Cements) ఎదురుదెబ్బ తగిలినట్లయింది. భారతీ సిమెంట్స్ ఎఫ్డీల స్థానంలో బ్యాంకు గ్యారంటీలను తీసుకొని ఎఫ్డీలను రిలీజ్ చేయాలని ఇంతకుముందు ఈడీకి హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ఈ ఆదేశాలను ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈడీ వాదనలతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా నేతృత్వంలోని ధర్మాసనం ఏకీభవించింది. గతంలో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది.
We’re now on WhatsApp. Click to Join.
బ్యాంకు గ్యారంటీలను తీసుకున్నాక కూడా ఎఫ్డీలను జప్తు చేశారని భారతీ సిమెంట్స్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు. కనీసం ఆ ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీనైనా విడుదల చేయాలని కోరుతూ భారతీ సిమెంట్స్ ఇంకో పిటిషన్ను సుప్రీంకోర్టులో వేసింది. అయితే దీన్ని కూడా సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. ఎఫ్డీలు విడుదల చేయాలన్న హైకోర్టు తీర్పునే పునః పరిశీలించాలని సూచించినప్పుడు.. జప్తు చేసిన ఎఫ్డీలపై వడ్డీ ఎలా వస్తుందని సుప్రీంకోర్టు బెంచ్ ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారణను ముగించినట్లు పేర్కొంది. అభ్యంతరాలు ఉంటే హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది.