Rave Party : హైదరాబాద్లో పోలీసులకు దొరికిపోయే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో రేవ్ పార్టీల నిర్వాహకులు బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు. ఇటీవల బెంగళూరు శివారులో జరిగిన ఓ రేవ్ పార్టీలో ఇద్దరు తెలుగు మహిళా నటులు హేమ, ఆషీ రాయ్ డ్రగ్స్ సేవించి దొరికిపోయారు. ఈ పార్టీలో తెలుగు రాష్ట్రాల నుంచి చాలామందే పాల్గొన్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ రేవ్ పార్టీ నిర్వాహకులు కూడా తెలుగు రాష్ట్రాల వారేనని దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో ఏ1గా విజయవాడకు చెందిన బుకీ లంకలపల్లి వాసు ఉన్నాడు. ఇక ఏ2గా చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం మడవనేరికి చెందిన అరుణ్కుమార్, ఏ3గా విజయవాడ వన్టౌన్ మల్లికార్జునపేట సమీపంలోని ఆకులవారివీధికి చెందిన డి.నాగబాబు ఉన్నాడని కర్ణాటక పోలీసులు వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయి రిమాండులో ఉన్న ఏ-2 అరుణ్కుమార్కు ఏపీలోని పలువురు వైఎస్సార్ సీపీ కీలక నేతలతో సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నారు. సీఎం జగన్, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డిలతో అతడు దిగిన ఫొటోలతో పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. ఈ ఫొటోలు శుక్రవారం సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి.ఈ కేసులో లంకలపల్లి వాసుతో పాటు అరుణ్కుమార్ను ఈ నెల 21న బెంగళూరు పోలీసులు అరెస్టుచేసి కోర్టులో హాజరుపరచగా పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక బెంగళూరు రేవ్ పార్టీ జరిగే భవనం వద్ద ఓ కారులో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పేరిట ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే దీనితో తనకు సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. సాధారణంగా ఎమ్మెల్యేలకు నాలుగు స్టిక్కర్లను జారీ చేస్తుంటారు. వారు తమకు అనుకూలంగా ఉండే కొందరికి ఆ స్టిక్కర్లను ఇస్తుంటారు.
ఇక రేవ్ పార్టీ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న లంకలపల్లి వాసు, ఏ3గా ఉన్న దొమ్మేటి నాగబాబు ఇద్దరూ విజయవాడ వాస్తవ్యులే. ఇప్పుడు వీరిద్దరూ అరెస్టయి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. నాగబాబు తండ్రి పెయింటింగ్ మేస్త్రీగా, ప్రైవేటు ఎలక్ట్రీషియన్గా చేస్తున్నారు. అతడికి ఇంకా పెళ్లి కాలేదు. బీటెక్ చదివి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నట్లు తెలిసింది. రేవ్పార్టీ సూత్రధారి వాసు, నాగబాబుకు బెంగళూరులోనే పరిచయమైనట్లు సమాచారం. వాసు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 19న రాత్రి బెంగళూరు శివారులో ఏ2 నిందితుడు అరుణ్కుమార్ రేవ్ పార్టీ ఏర్పాటుచేసినట్లు ఎఫ్ఐఆర్లో పోలీసులు ప్రస్తావించారు. ఈ రేవ్ పార్టీ కోసం నాగబాబు, చిత్తూరు జిల్లాకు చెందిన రణధీర్బాబు కలిసి ఎండీఎంఏ, కొకైన్, లిక్విడ్ గంజాయి తరలించారు. దీంతో ఈ కేసులో రణధీర్బాబును ఏ4గా చేర్చారు. బెంగళూరు పోలీసులు ఫామ్హౌస్పై దాడి చేసినప్పుడు.. నాగబాబు కారులో మత్తుపదార్థాలు దొరికాయి.