వెన్నుపోటు అనగానే చంద్రబాబు గుర్తొచ్చేలా ప్రత్యర్థులు రాజకీయ ముద్రవేశారు. దాన్ని తుడిచే ప్రయత్నం ‘ఆహా’ వేదికగా బాలక్రిష్ణ తన షోలో ప్రయత్నం చేశాడు. ఆనాడు జరిగిన పరిణామాలకు చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబ సభ్యులం అందరిమూ మద్ధతు పలికామని చెప్పాడు. కానీ, చంద్రబాబు ఇప్పటికీ వెన్నుపోటుదారుడిగా అందరి ముందు నిలిచాడని బాలయ్య కన్నీటిపర్యంతం అయ్యాడు. ఆ సన్నివేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడ్ని చేసిన ఘట్టాన్ని చంద్రబాబు వర్గీయులు అధికార మార్పిడిగా భావిస్తున్నారు. ఆనాడున్న పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని ఇప్పటికీ ఆయన వర్గీయులు సమర్థించుకుంటారు. కానీ, ప్రత్యర్థులు మాత్రం మాయని మచ్చలాగా చంద్రబాబు మీద వెన్నుపోటు ముద్రను వేయగలిగారు. ఆ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ విజయం సాధించారు. విశ్వాసఘాతకుడిగా, వెన్నుపోటుదారునిగా చంద్రబాబును రాజకీయ వేదికలపై ప్రత్యర్థులు తూలనాడుతూ ఉంటారు.
వాస్తవంగా ఏది వెన్నుపోటు? ఏది అధికారి మార్పిడి? అనేది ప్రశ్నలు వేసుకుంటే…నైతికత అనే అంశం తెరమీదకు వస్తోంది. అనైతికంగా చేసిన రాజకీయాలు అన్నీ వెన్నుపోటు కిందకు వస్తాయని భావిస్తే…వైఎస్ఆర్, జగన్, కేసీఆర్..ఇలా దాదాపు అందరూ వెన్నుపోటుదారుల జాబితాలోకి వస్తారు. రాజ్యాంగం, శాసన వ్యవస్థ కల్పించిన వెసులబాటును పరిగణనలోకి తీసుకుంటే, చంద్రబాబుతో సహా ఎవరూ వెన్నుపోటుదారులు కాదు.
మోజార్టీ ఎమ్మెల్యేలు 1995 ఎపిసోడ్ లో చంద్రబాబు పక్షాన నిలిచారు. వైస్రాయ్ హోటల్ కేంద్రంగా రాజకీయాలు నడిచిన మాట వాస్తవం. ఆ రోజున గవర్నర్ ఆదేశాల మేరకు రాజ్యాంగ బద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన కంటే ముందు నాదెండ్ల భాస్కరరావు కూడా అలాగే చేశాడు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు నాటకాల్లో ఒకటో కృష్ణుడు..రెండో కృష్ణుడు తరహాలో ఢిల్లీ ఆదేశానుసారం ముఖ్యమంత్రుల మార్పు ఉండేది. దాన్ని కూడా వెన్నుపోటు కింద తీసుకోవాలా? లేక అధికార మార్పిడి కింద తీసుకోవాలో..ఆలోచించాలి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా 2004లో బాధ్యతలు స్వీకరించిన తరువాత అనేక మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆయన పంచన చేరారు. మన్మోహన్ సింగ్ పై పార్లమెంట్లో పెట్టిన విశ్వాస తీర్మానం సందర్భంగా టీడీపీ ఎంపీలను లోబరుచుకుని అనుకూలంగా వైఎస్ ఓట్లు వేయించుకున్నాడు. ఆ తరువాత ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు జగన్ కూడా వల్లభనేని వంశీ, మందాలగిరి, కరణం బలరాం, గంటా తదితర టీడీపీ ఎమ్మెల్యేలను ఆయన పంచన చేర్చుకున్నాడు. టీడీపీ పార్టీని , చంద్రబాబును బూతులు వాళ్లు తిడుతున్నారు. ఈ పరిణామం అధికార మార్పిడి కింద వస్తుందా? వెన్నుపోటు కిందకు వస్తుందా? అంటే సమాధానం రావడంలేదు. ఇలాంటి రాజకీయం దేని కిందకు వస్తుందో..కూడా తెలియడంలేదు.
తెలుగుదేశం పార్టీ నుంచి ఎదిగిన కేసీఆర్ ఆ పార్టీని నామరూపాల్లేకుండా చేస్తున్నాడు. ఏకంగా తెలుగుదేశం పార్టీని అసెంబ్లీ, మండలి వేదికగా విలీనం చేసుకున్నాడు. దీన్ని అధికార మార్పిడి అందామా? వెన్నుపోటు అందామా?..అంటే రాజ్యాంగం ప్రకారం విలీనం జరిగిందని కేసీఆర్ అంటాడు. రాజ్యసభలో టీడీపీ విలీనం చట్ట ప్రకారం జరిగిందని బీజేపీ పెద్దలు చెబుతారు. మరి, చంద్రబాబు 1995లో చేసిన ఎపిసోడ్ రాజ్యాంగ బద్ధం కాదా..అంటే కాదనలేం. ఆ తరువాత జరిగిన 1999 ఎన్నికల్లో ఆయన్ను ప్రజలు ఆదరించారు. అంటే, ఎన్టీఆర్ ను పదవీచ్యుడ్ని చేయడాన్ని ప్రజలు అంగీకరించినట్టే అనుకోవాలా..? అంటే ఔననీ చెప్పలేం. ఇలాంటి పరిస్థితులను విశ్లేషిస్తే, ఏది వెన్నుపోటు ఏది అధికార మార్పిడి? అనేది ఎవరూ స్పష్టంగా చెప్పలేరు. కానీ, పార్లమెంట్ వేదికగా ఎంపీలను కొనుగోలు చేసిన వైఎస్ చేసిన పని, అసెంబ్లీ వేదికగా టీడీపీ ఎమ్మెల్యేలతో బాబును బూతులు తిట్టిస్తోన్న జగన్ వాలకం..చట్టబద్ధం కాదని మాత్రం చెప్పొచ్చు. సో..ఇప్పుడు తేల్చండి ఎవరిది వెన్నుపోటు..ఎవరిది అధికార మార్పిడి…ఎవరిది నైతికత..ఎవరిది విశ్వాసఘాతకమో..! పాపం చంద్రబాబు మాత్రం వెన్నుపోటు ముద్రను మోస్తున్నాడు. అందుకే, బాలయ్య ఆ విధంగా కన్నీరు పెట్టుకుని ఉంటాడు.