విశాఖపట్నంలో ఓ వివాహితపై ఆటో డ్రైవర్ యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటన పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని నందువానిపాలెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కె శిరీష అనే బ్యూటీషియన్.. తన భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా జీవిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ నర్సింగరావుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధానికి దారి తీసింది. అయితే ఇటీవల శిరీష, ఆమె భర్త మళ్లీ కలిశారు. శిరీష తన భర్త వద్దే ఉంటున్నానని, తన వద్దకు రావద్దని నర్సింగరావుకు చెప్పింది. దీన్ని జీర్ణించుకోలేని నర్సింగ్ ఆమెపై యాసిడ్ పోశాడు. స్థానికులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ తీవ్రత కారణంగా, శిరీష ముఖం మీద దద్దుర్లు కనిపించాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.