పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై జగన్ ముఠా హత్యాయత్నానికి తెగబడటాన్ని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కనుసన్నల్లోనే ఈ కాల్పులు జరిగాయని ఆయన ఆరోపించారు. బాలకోటిరెడ్డిపై దాడి జరగడం ఇది రెండోసారని.. అయినా సరైన జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. మొదటిసారి దాడికి పాల్పడిన వెంకటేశ్వర్ రెడ్డికి ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆశ్రయమివ్వడం వైసీపీ నేతల విధ్వంస విధానాలకు నిదర్శనమన్నారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడును జగన్ రెడ్డి వచ్చిన తర్వాత వల్లకాడు చేస్తున్నారని.. టీడీపీ నేతలు, ప్రశ్నించినవారిని వరుసగా అంతమొందిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. పల్నాడును అభివృద్ధి చేసిన ఘనత టీడీపీకి దక్కితే గన్ కల్చర్ తీసుకువచ్చిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. స్వగ్రామం అలవాలలో ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని బయటకు పిలిచి హత్యకు యత్నించడం పైశాచికత్వానికి నిదర్శనం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఈ హత్యాయత్నంలో పాల్గొన్న నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.