ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికులను ఆకర్షించేందుకు వివిధ పథకాలను ప్రవేశపెడుతోంది. ఆదాయం సమకూర్చుకునేందుకు ఆఫర్లను ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్లకు బస్ టికెట్లలో రాయితీ కోసం డిజిటల్ ఆధార్ కార్డును కూడా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఆర్టీసీ నిర్ణయించింది. సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ టికెట్ల ధరల్లో 25 శాతం రాయితీ ఇస్తోంది. అందుకోసం ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్పోర్ట్, రేషన్కార్డులను గుర్తింపు కార్డులుగా పరిగణిస్తున్నారు. ఇక నుంచి డిజిటల్ ఆధార్ను కూడా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఆర్టీసీ ఈడీ కేఎస్ బ్రహ్మానందరెడ్డి అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.