సంక్రాంతి పండగను ఏపీఎస్ ఆర్టీసీ క్యాష్ చేసుకుంటుంది. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారం మోపేందుకు రంగం సిద్ధం చేసింది. పట్టణాల నుంచి సొంతూళ్లకు చాలామంది వెళ్తుడంటంతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలతో పాటు ఏపీలోని ఇతర ప్రాంతాలకు మొత్తం 1266 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. జనవరి 7 నుంచి 17 వరకు ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ప్రత్యేక బస్సుల్లో 50శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తుగా టికెట్ రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించినట్టు చెప్పారు. ప్రయాణికులు ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు కోరారు. ఇప్పటి వరకు కరోనా కారణంగా తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీ.. పండగల పేరుతో అదనపు ఛార్జీలు వసుళ్లు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్డినరీ బస్సులను స్పెషల్ బస్సులుగా వేసి వాటిల్లో సూపర్ లగ్జరీ బస్సుకు ఉన్న టికెట్ రేట్ల కంటే ఎక్కువగా తీసుకుంటున్నారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక బస్సుల్లో కూడా సాధారణ ఛార్జీలు ఉంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.