కోనసీమ వద్ద నిలిచిపోయిన అమరావతి టూ అరసవెల్లి మహా పాదయాత్ర `రథం`లోని సాంకేతిక పరికరాల మాయం పోలీసులు, రైతుల మధ్య వివాదంగా మారింది. సీసీ ఫుటేజ్, హార్డ్ డిస్క్ లను పోలీసులు స్వాధీనం చేసుకోవడంపై రైతులు ఆగ్రహిస్తున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా రథం చుట్టూ అమర్చిన సీసీ కెమెరాలను పోలీసులు తీసుకెళ్లడం దౌర్జన్యం కిందకు వస్తుందని చెబుతున్నారు. పాదయాత్రకు సంబంధించిన వీడియో ఫుటేజ్ హార్డ్ డిస్క్ ల్లో ఉంది. వాటిని పోలీసులు పరిశీలిస్తున్నారని రైతులు అనుమానం. ఎందుకు హార్డ్ డిస్క్ లను తీసుకెళ్లారని ప్రశ్నిస్తున్నారు.
అసెంబ్లీ టు అరసవెల్లి మహా పాదయాత్ర సెప్టెంబరు 12వ తేదీన ప్రారంభమైంది. ఉద్రిక్త పరిస్థితుల నడుమ కోనసీమ జిల్లాలో అక్టోబరు 22వ తేదీన తాత్కాలికంగా ఆగిపోయింది. సురక్షితంగా యాత్ర కొనసాగింపు కోసం రైతులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. యాత్ర ఆగిపోవడంతో రామచంద్రాపురంలోని ఒక ప్రైవేటు స్థలం వద్ద రథాన్ని భద్రపరిచారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామివారి రూపంతో తయారు చేసిన దివ్య రథం యాత్రకు ముందు ఉంటుంది. ఈ రథానికి నలువైపులా సీసీ కెమెరాలు అమర్చారు. ఆ రథాన్ని రామచంద్రాపురంలోని ఒక ప్రయివేటు స్థలంలో నిలిపి కాపలాగా ప్రైవేటు భద్రతా సిబ్బందిని ఉంచారు. యాత్ర నిలిచిపోయిన వారం రోజులకు రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు రథం వద్దకు వచ్చారు. అక్కడి భద్రతా సిబ్బందిపై దాడిచేసి రథానికి అమర్చిన సీసీ కెమెరాల హార్డ్ డిస్కులను తీసుకెళ్లారు.
Also Read: Amaravathi: అమరావతి పై `సుప్రీం` చీఫ్ లలిత్ కీలక నిర్ణయం
పోలీసుల మీద ప్రైవేటు భద్రతా సిబ్బంది దాడికి ప్రయత్నించారని, అందుకే, వాళ్లను కొట్టాల్సి వచ్చిందని డీఎస్పీ బాలచంద్రారెడ్డి చెబుతున్నారు. నోటీసులు ఇవ్వకుండా తనఖీలు చేసిన హార్డ్ డిస్క్ లను తీసుకెళ్లిన పోలీసులు ఇప్పటి వరకు న్యాయస్థానంకు వాటిని ఎందుకు అప్పగించలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఆధారాలు మాయంచేయడం కోసం రామచంద్రాపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి, అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి హార్డ్ డిస్క్ తమ వద్ద ఉంచుకున్నారని రైతుల ఆరోపణ.
రథం వద్దకు వెళ్లినప్పుడు ముగ్గురు ప్రైవేటు సిబ్బంది దాడి చేయడానికి ప్రయత్నిచడం కారణంగా హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసు కున్నామని రామచంద్రాపురం ఎస్.ఐ. డి.సురేష్ బాబు ప్రకటించారు. కానీ, నోటీసులు లేకుండా దౌర్జన్యంగా తీసుకెళ్లిన హార్డ్ డిస్కలను వారం రోజులుగా కోర్టుకు అందివ్వలేదని రైతులు నిలదీస్తున్నారు. 40రోజుల పాదయాత్ర పుటేజి అందులో ఉందని, ఆధారాలు పాడచేస్తారనే అమరావతి జేఏసీ కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు అనుమానిస్తున్నారు.
Also Read: Flex Ban In AP: ఏపీలో వాయిదా పడ్డ ప్లాస్టిక్ ప్లెక్సీలపై నిషేధం అమలు
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత పరిధిలోని 29 గ్రామాల రైతులు చేస్తున్న పాదయాత్ర తాత్కాలికంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. హైకోర్టు డైరక్షన్ కోసం రైతులు వేచిచూస్తున్నారు. ఆ లోపుగా పోలీసులు హడావుడి రైతులను హైరానాకు గురి చేస్తోంది.