ఏపీ మంత్రి అప్పలరాజుకు విశాఖ శారదపీఠం వద్ద అవమానం జరిగింది. అక్కడ డ్యూటీ చేస్తోన్న సర్కిల్ ఇన్ స్పెక్టర్ పీఠంలోకి మంత్రిని అనుమతించలేదు. భద్రతా నిబంధనల ప్రకారం ఒక్కరే లోపలకు వెళ్లాలని మంత్రికి సూచించాడు. అనుచరులతో వెళ్లాలని మంత్రి పట్టుబట్టడంతో వాగ్వాదం జరిగింది. ఆ సందర్భంగా అనుచిత వ్యాఖ్యలను ఇన్ స్పెక్టర్ ఉపయోగించాడు. ప్రవేశం వద్ద ఉన్న గేటును వేయడంతో మంత్రి అప్పలరాజు సీరియస్ గా వెళ్లిపోయాడు.
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విశాఖ నగరానికి వెళ్లారు. ఒకరోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మధ్యాహ్నం వరకు శ్రీ విశాఖ శారదా పీఠం వార్షికోత్సవం ‘మహోత్సవం’లో పాల్గొన్నారు. ఆయన రాక సందర్భంగా విశాఖపట్నం విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి పలువురు మంత్రులు, అధికారులు, వైఎస్సార్సీపీ నేతలు ఘనస్వాగతం పలికారు.
డిప్యూటీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, పర్యాటక శాఖ మంత్రి ఎం శ్రీనివాసరావు, మేయర్ జి హరి వెంకట కుమారి, ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు, జిల్లా కలెక్టర్ ఎ మల్లికార్జున, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర, ఎంపిలు ఎంవివి సత్యనారాయణ, బి సత్యవతి తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి పెందుర్తిలోని చిన్నముషిడివాడలో ఉన్న శ్రీ జగన్మోహన్రెడ్డి పీఠానికి వెళ్లారు. ఈ సందర్భంగా నిర్వహించే ‘రాజశ్యామల పూజ’ తదితర కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొని పీఠం నుంచి తిరిగి విశాఖపట్నం నుంచి తాడేపల్లికి చేరుకున్నాడు.