Minister Roja : డేరా బాబాగా చంద్ర‌బాబును పోల్చిన రోజా

డేటా చోరీపై టీడీపీ, వైసీపీ మ‌ధ్య అసెంబ్లీలో కంటే బ‌య‌ట ప‌ర‌స్ప‌రం రాజ‌కీయ‌దాడి వేడిక్కెంది. ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన మధ్యంత‌ర నివేదిక బూట‌క‌మ‌ని టీడీపీ చెబుతోంది.

  • Written By:
  • Publish Date - September 20, 2022 / 03:48 PM IST

డేటా చోరీపై టీడీపీ, వైసీపీ మ‌ధ్య అసెంబ్లీలో కంటే బ‌య‌ట ప‌ర‌స్ప‌రం రాజ‌కీయ‌దాడి వేడిక్కెంది. ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన మధ్యంత‌ర నివేదిక బూట‌క‌మ‌ని టీడీపీ చెబుతోంది. కానీ, చంద్ర‌బాబు సీఎంగా ఉన్నప్పుడు డేటా చోరీ జ‌రిగింద‌ని వైసీపీ లీడ‌ర్లు చెబుతున్నారు. ఆ విష‌యంపై మాట్లాడేందుకు మీడియా ముందుకొచ్చిన రోజా మాత్రం చంద్ర‌బాబును టార్గెట్ చేస్తూ త‌న‌దైన‌శైలిలో నోరుపారేసుకున్నారు. ఆయ‌న్ను డేరా బాబాతో పోల్చుతూ విమ‌ర్శిల‌కు దిగారు.

చంద్ర‌బాబు ప్రభుత్వ హయాంలో డేటా చోరీ జరిగిందని మంత్రి రోజా అన్నారు. డేటా దొంగ చంద్రబాబు అని విమర్శించారు. డేరా బాబా కంటే డేటా దొంగ చాలా డేంజరస్ అని చెప్పారు. ప్రజా సాధికారత సర్వే పేరుతో సేవా మిత్ర ద్వారా టీడీపీ నాయకులకు విలువైన సమాచారాన్ని అందించారని తెలిపారు. ఈ అంశంపై వేసిన హౌస్ కమిటీ తన రిపోర్టును ఇవ్వగానే టీడీపీ నేతల గుండెలు జారిపోయాయని చెప్పారు. డేటా చోరీ అంశంపై చంద్రబాబు కోర్టులో స్టే తెచ్చుకోకపోతే జీవితాంతం జైల్లో ఉంటారని అన్నారు. దాదాపు 30 లక్షల ఓట్లను అక్రమంగా తొలగించాలని దుర్మార్గపు ఆలోచన చేశారని విమర్శించారు. ఆరోజు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాపింగ్ చేయించి, వారిని బ్లాక్ మెయిల్ చేసి టీడీపీలో చేర్చుకున్నారని చెప్పారు.

నారా లోకేశ్ ఒళ్లు తగ్గించుకోవడానికి ఏవేవో చేశారని, బుర్రలో గుజ్జును పెంచుకోవడానికి కూడా ఏదైనా చేస్తే బాగుంటుందని రోజా సెటైర్ వేశారు. అన్నా క్యాంటీన్లు ఎన్ని పెట్టారో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. చంద్రబాబు ఏ ఒక్క పథకాన్ని కూడా సొంతంగా అమలు చేయలేదని అన్నారు. టీడీపీ నేతలకు సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు. మొత్తం మీద డేటా చోరీ వ్య‌వ‌హారం రాజ‌కీయ దుమారాన్ని రేపుతోంది. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల దిశ‌గా ఆ ఇష్యూ మ‌ళ్లుతోంది. చంద్ర‌బాబును డేరాబాబాగా పోల్చ‌డం, లోకేష్ ను బాడీషేమింగ్ చేస్తూ రోజా మాట్లాడ‌డం టీడీపీ మ‌హిళ లీడ‌ర్ల‌ను రెచ్చ‌గొట్టేలా చేస్తోంది.