రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భద్రత బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం తప్పు చేసిందని ఎవరైనా నమ్మితే తమ ఆందోళనను ఉధృతం చేయాలని సూచించారు. చంద్రబాబు నాయుడు అరెస్టు అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, వివిధ దర్యాప్తు సంస్థలు జరిపిన దర్యాప్తులో అవినీతి ఉదంతాలు వెల్లడయ్యాయని మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్ఘాటించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయనకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో భద్రత లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు కుటుంబసభ్యులు కూడా ములాఖత్కు వెళ్లి అక్కడ భద్రత లేదని ఆరోపించారు. ఇటు ఎన్ఎస్జీ అధికారులు కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో భద్రతపై కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబు భద్రతపై స్పందించారు. ఆయన భద్రత ప్రభుత్వ బాధ్యత అంటూ వ్యాఖ్యానించారు. ఇటు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును అన్ని రాజకీయ పార్టీలు స్వాగతిస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లను ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.