Site icon HashtagU Telugu

ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

Ap Liquor Scam Case

Ap Liquor Scam Case

ACB Court : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు తిరిగింది. విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు శనివారం (సెప్టెంబర్ 6) రోజున ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. ముగ్గురు నిందితులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరువర్గాల వాదనలు ముగిసినట్లు తెలిపింది. ఈ మేరకు ఇవాళ ముగ్గురికీ బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ సీఎంఓ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు బెయిల్ లభించింది. సిట్ అధికారులు బాలాజీ గోవిందప్పను మే 13న, ధనుంజయ్ రెడ్డి మరియు కృష్ణమోహన్ రెడ్డిని మే 16న అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో తన పేరు ముడిపడినట్లు తెలిసిన వెంటనే బాలాజీ గోవిందప్ప సుమారు రెండు వారాల పాటు పరారీలో ఉన్నారు. పోలీసులకు గాలిమరుగై పలు రిసార్ట్‌లు మారుతూ తిరిగిన ఆయనను చివరకు కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని చామరాజనగర జిల్లాలోని ఎరకనగడ్డె ప్రాంతంలో ఉన్న ఓ వెల్‌నెస్ సెంటర్ వద్ద అరెస్ట్ చేయగలిగారు.

Read Also: Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

అనంతరం సిట్ అధికారులు నిందితులను కోర్టులో హాజరుపరచగా, రిమాండ్ విధిస్తూ విచారణ కొనసాగించారు. నిందితులు ఇప్పటికే అనేకసార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ, కోర్టు వాటిని తిరస్కరించింది. చివరికి శనివారం విచారణలో ముగ్గురికీ బెయిల్ మంజూరవ్వడం కేసులో కీలక పరిణామంగా నిలిచింది. ఈ కేసులో ధనుంజయ్ రెడ్డి ఏ31, కృష్ణమోహన్ రెడ్డి ఏ32, బాలాజీ గోవిందప్ప ఏ33 నిందితులుగా ఉన్నారు. వీరిపై ప్రభుత్వ పాలనకు విరుద్ధంగా ప్రయోజనాలు పొందేందుకు లిక్కర్ కాంట్రాక్టులు, అనుమతుల్లో అక్రమ రీతిలో జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విచారణలో భాగంగా సిట్ ఇప్పటికే అనేక కీలక డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీలను స్వాధీనం చేసుకుంది.

బెయిల్ మంజూరు కావడంతో వీరికి తాత్కాలిక ఊరట లభించినప్పటికీ, విచారణ ఇంకా కొనసాగనుంది. సిట్ అధికారులు తమ దర్యాప్తును మరింత బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మరోవైపు, ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రభావం చూపుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఈ ముగ్గురిలో ఇద్దరు మాజీ సీఎంఓ కార్యాలయానికి చెందినవారైన మరింత చర్చనీయాంశంగా మారింది. కేసు నేపథ్యంలో ఇంకా కొంతమంది కీలక వ్యక్తుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలిసింది. లిక్కర్ పాలసీలో జరిగిన అవకతవకలు, రాజకీయ ప్రభావంతో తీసుకున్న నిర్ణయాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం గమనాన్ని కేంద్రీకరించింది. ఇటీవల ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ కేసులో నిందితులకు ఊరట లభించినప్పటికీ, చివరికి న్యాయపరిధిలో వారి పాత్ర ఏ మేరకు నిరూపితమవుతుందన్నదే కీలకం కానుంది.

Read Also: MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల