Site icon HashtagU Telugu

AP Liquor: ఏపీలో మద్యం సిండికేట్ల పంజా!

Ap Liquor

Ap Liquor

అమరావతి: మద్యం షాపులపై ఎమ్మెల్యేలు, నేతల పెత్తనం. అనుచరులు, సిండికేట్లతోనే దరఖాస్తులు ఇతరులు వేయకుండా బెదిరింపులు, ఒకవేళ వేస్తే వ్యాపారం చేయలేరని హెచ్చరింపులు. అధికారులపైనా ఒత్తిడి కొన్నిచోట్ల వాటా కండిషన్‌తో అనుమతి లక్ష దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అంచనా ఇప్పటి వరకూ వచ్చింది. 20 వేలు మాత్రమే నేతల ప్రమేయంతో సర్కారు ఆదాయానికి గండి, మరో 2 రోజులే దరఖాస్తులకు గడువు. “ఈ జిల్లాలో షాపులు మాకు వదిలేయండి. అక్కడ మావాళ్లు దరఖాస్తు చేస్తున్నారు.” ఇంకెక్కడైనా చూసుకోండి… ఈ విషయంలో ఎన్టీఆర్ జిల్లాలో ఒక సీనియర్ నాయకుడి హెచ్చరిక ఇది. “దరఖాస్తు పెట్టుకోండి. లాటరీలో లైసెన్స్‌ వస్తే వ్యాపారంలో 5 శాతం వాటా ఇవ్వాలి”… ఈ విషయంలో నెల్లూరు జిల్లాలో ఒక నేత దందా ఇది.

ప్రైవేటు మద్యం షాపుల దరఖాస్తు ప్రక్రియలో కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు సాగిస్తున్న బెదిరింపుల పర్వం ఇది. ఒత్తిళ్లు, బెదిరింపులతో చాలామంది వ్యాపారులు ‘మాకెందుకీ తలనొప్పని’ దరఖాస్తు చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో ఎక్సైజ్ శాఖ అంచనా మేరకు దరఖాస్తులు రావడం లేదు. ఒక్కో షాపునకు సగటున 30 దరఖాస్తులు వస్తాయని అధికారులు భావించగా, చాలా చోట్ల సింగిల్‌ డిజిట్‌ దాటడం లేదు. 2017లో పాలసీ ప్రకటించినప్పుడు 75వేల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు దాదాపు లక్ష వస్తాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేసింది. ఆ స్థాయిలో దరఖాస్తులు అందితే రూ.2 వేల కోట్ల ఆదాయం దరఖాస్తు రుసుముల రూపంలోనే వస్తుంది. ప్రస్తుతం 20 వేల దరఖాస్తులే వచ్చాయి. దీన్ని బట్టి ఎమ్మెల్యేలు, నేతల బెదిరింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దరఖాస్తులకు మరో రెండు రోజుల గడువు ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు, నాయకుల ప్రమేయం ఇలాగే కొనసాగితే అనుకున్న స్థాయిలో దరఖాస్తులు వస్తాయా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి పడే అవకాశముంది.

ఒక్కో షాపునకు సగటున 6 దరఖాస్తులు:

మద్యం షాపులకు సోమవారం సాయంత్రానికి 20,310 దరఖాస్తులు వచ్చాయి. సగటున ఒక్కో షాపునకు 6 దరఖాస్తులు అందాయి. కాకినాడలో 155 షాపులుంటే 592 దరఖాస్తులే వచ్చాయి. అంటే సగటున 4 దరఖాస్తులు కూడా రాలేదు. తిరుపతి జిల్లాలో 227 షాపులకు 680 దరఖాస్తులు అందాయి. ప్రకాశంలో 171 షాపులకు 622, నెల్లూరులో 182 షాపులకు 650 దరఖాస్తులు అందాయి. ఈ జిల్లాల్లో మరీ తక్కువ దరఖాస్తులు రావడంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఒక వైపుల ఎమ్మెల్యేలు ఒత్తిడి, మరో వైపుల భారీగా పెంచిన దరఖాస్తు రుసుము. దరఖాస్తుదారులు రూ.2 లక్షలు కావడంతో కొంత వెనకడుగు వేస్తున్నారు.

పర్మిట్ రూమ్ కి అనుమతి నిరాకరణ:

మద్యం షాపుల పక్కనే మందు తాగేందుకు గతంలో పర్మిట్‌ రూమ్‌ అనే విధానం ఉండేది. నూతన నియమాలులో పర్మిట్‌ రూమ్‌కు అనుమతి ఇవ్వలేదు. పర్మిట్‌ రూమ్‌కు అవకాశం ఇచ్చి ఉంటే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చేది. పర్మిట్‌ రూమ్‌ కోసం అదనంగా రూ.5 లక్షలు చెల్లించాలి. అవకాశం ఇస్తే ప్రతి షాపులో ఇది ఏర్పాటు చేస్తారు. దీనివల్ల అమ్మకాలు పెరుగుతాయి. అలాగే పర్మిట్‌ రూమ్‌లో వాటర్‌ ప్యాకెట్లు, గ్లాసులు, ఇతరత్రా తినుబండారాలు విక్రయించడం ద్వారా లైసెన్సీకి అదనపు ఆదాయం వచ్చేది. పర్మిట్‌ రూమ్‌లకు అవకాశం ఇచ్చి ఉంటే దరఖాస్తుల సంఖ్య పెరిగేదన్న వాదన వినిపిస్తోంది.

పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్నా:

పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న, మద్యం సిండికేట్లను చూసి భయపడుతున్న పెట్టుబడిదారులు. ఐదేళ్ల తరువాత ప్రైవేటు మద్యం పాలసీ ప్రకటనతో వ్యాపారులతో పాటు పెట్టుబడి పెట్టగలిగే సాధారణ వ్యక్తులలోనూ షాపులపై విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కానీ స్థానిక రాజకీయాలు, సిండికేట్ల వ్యవహారంతో వెనకడుగు వేస్తున్నారు. అదృష్టం బాగుండి లైసెన్స్‌ వచ్చినా స్థానిక నేతలు, సిండికేట్లను కాదని వ్యాపారం చేయగలమా? అనే సందిగ్ధంలో పడ్డారు.

నూతన మద్యం పాలసీని పారదర్శకంగా అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. దోపిడీ, అక్రమాలకు తావు లేకుండా విధి విధానాలు రూపొందించింది. ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ప్రైవేటు షాపులకు దరఖాస్తులు ఆహ్వానించింది. కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు దరఖాస్తుల ప్రక్రియను అవకాశంగా తీసుకుని దందాలు చేస్తున్నారు.

చాలా జిల్లాల్లో ఎమ్మెల్యేలు, నేతలు తమ అనుచరులు, బినామీలకే మద్యం షాపులు దక్కేలా చక్రం తిప్పుతున్నారు. తమ వారిని సిండికేట్‌గా చేసి, ఇతరులు ఎవరూ దరఖాస్తు చేయకుండా బెదిరిస్తున్నారు. మరోవైపు దరఖాస్తులు తీసుకోవద్దంటూ అధికారులపైనా ఒత్తిడి చేస్తున్నారు. మరికొన్ని చోట్ల వాటాలు మాట్లాడుకుంటున్నారు. దీంతో దరఖాస్తు చేయడానికి వ్యాపారులు భయపడుతున్నారు. నేతల తీరుతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడే పరిస్థితి కనిపిస్తుంది.

ఇంకా రెండు రోజులు మాత్రమే దరఖాస్తులకు ఆహ్వానం:

సోమవారం ఒక్కరోజులో దాదాపు 12 వేల దరఖాస్తులు వచ్చినందున, మంగళ, బుధవారాల్లో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. సాధారణంగా, మద్యం పాలసీలకు సంబంధించి, చివరి రోజునే ఎక్కువ మద్దతు ఉంటుంది. వ్యాపారులు ఎక్కడెక్కడ ఏన్ని దరఖాస్తులు వచ్చాయో లెక్క వేసుకుని, పోటీ తక్కువగా ఉన్న చోట్ల దరఖాస్తు చేయాలని భావిస్తున్నారు. తరచుగా చివరి రెండు రోజుల వరకు వేచి చూసి, ఒకేసారి అందరు దరఖాస్తు చేస్తుంటారు. ఈ సమయంలో కూడా అదే పరిస్థితి ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ రాజకీయ ప్రమేయం లేకపోతే, ఈ దరఖాస్తుల సంఖ్య ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యాఖ్యానాలు వ్యక్తమవుతున్నాయి.

బెదిరింపుల పర్వం ఎలా జరుగుతుంది అంటే:

ఎన్టీఆర్ జిల్లాలో, ఒక ఎమ్మెల్యే 20 మందిని సిండికేట్ చేసుకుని, వారితోనే దరఖాస్తులు చేయిస్తున్నారు. ఇతర వ్యాపారులను బెదిరించడం ద్వారా దరఖాస్తులు వేయకుండా చేస్తున్నారు.

కృష్ణా జిల్లాలో, ఒక యువ ఎమ్మెల్యే కొత్త వ్యాపారులకు పోలీసుల ద్వారా బెదిరింపు ఇస్తున్నారు. షాపు తెరవడానికి కూడా వ్యాపారం కష్టమని హెచ్చరిస్తున్నారు.

విజయవాడకు సమీపంలో ఉన్న నియోజకవర్గంలో, లైసెన్స్ వచ్చినా వదులుకోవాలని బెదిరిస్తున్నారు. దీని వల్ల వ్యాపారులు ముందుకు రాకుండా చేస్తున్నారు.

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో, మండలాల వారీగా సిండికేట్ ఏర్పడి, ఇతరుల దరఖాస్తులు తీసుకోవద్దని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు.

తాడిపత్రి, గుంతకల్లు, అనంతపురం అర్బన్ నియోజకవర్గాల్లో నేతల బెదిరింపులు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారులను గెస్ట్ హౌస్కు పిలిచి బెదిరించినట్లు సమాచారం ఉంది.

తూర్పుగోదావరి జిల్లాలో, రాజమండ్రికి సమీపంలో ఉన్న ఒక నియోజకవర్గంలో అనధికార ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. గతంలో ఆయన స్థానిక ఎమ్మెల్యేతో కలిసి లిక్కర్ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు.

శ్రీకాళహస్తిలో, ఒక నేత బెదిరింపులతో దరఖాస్తులు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవద్దని ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు వస్తే, ఎలా చూసుకోవాలో అధికారులు ప్రశ్నించారు, అయితే వారిని దారితప్పించారు.

రాజమండ్రిలో, టీడీపీ, జనసేన నేతల అనుచరులు, ఒక విద్యా సంస్థ యజమాని సోదరుడు మద్యం షాపుల కోసం కృషి చేస్తున్నారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో, ఒక నేత అనుచరుడు మాత్రమే దరఖాస్తులు వేస్తున్నారు. మంత్రాలయంలో ఇద్దరు నేతల మధ్య పంపకాల చర్చలు జరుగుతున్నాయి. ‘60:40 నిష్పత్తిలో పంచుకుందాం’ అని నిర్ణయించిన కర్నూలు నేతలు, ఈ విషయంపై వ్యాపారులు దరఖాస్తులు ఆపేశారు.

విశాఖలో, ఒక ఎమ్మెల్యే మొత్తం వ్యవహారాలను నియంత్రిస్తున్నారు. ఇప్పటికే అధికారుల పోస్టింగ్‌ల విషయంలో ప్రభావం చూపించి, షాపులపై తన పట్టు ఉన్నట్లు చెబుతున్నారు.

అంత జరిగాక రంగంలోకి ఎక్సైజ్‌ శాఖా:

ఎమ్మెల్యేలు, నాయకుల ఒత్తిళ్లను ఎక్సైజ్ శాఖ సీరియస్‌గా తీసుకుంది. దరఖాస్తుదారులకు స్వేచ్ఛగా దరఖాస్తులు సమర్పించగల వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో, వ్యాపారానికి ఎలాంటి అవరోధాలు ఉండవనే భరోసాను అందించేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో, అధికారులు జిల్లాల ఎక్సైజ్ స్టేషన్లను సందర్శించి, దరఖాస్తులకు అడ్డంకులు లేకుండా చూడాలని సూచించారు. దరఖాస్తుదారులకు మరింత సౌకర్యాన్ని కల్పించడానికి, ఎక్సైజ్ శాఖ రుసుము చెల్లింపు విధానాల్లో మార్పులు చేసింది.

సీఎఫ్‌ఎమ్‌ఎస్‌లో సిటిజన్ చలాన్ ఫెసిలిటీ ద్వారా ఏ బ్యాంకు ద్వారా అయినా దరఖాస్తు రుసుము చెల్లించేందుకు అవకాశాన్ని అందించింది. అలాగే, గ్రామీణ బ్యాంకుల్లో డీడీలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.