AP Minister: జగన్ అంటే ఓ నిజం.. చెప్పిందే చేస్తారు: సమాచార శాఖా మంత్రి వేణుగోపాల కృష్ణ

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిజం మాట్లాడతారని, చెప్పింది చేస్తారని బీసీ సంక్షేమ, సమాచార శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ చెప్పారు.

Published By: HashtagU Telugu Desk
venugopal krishna

venugopal krishna

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిజం మాట్లాడతారని, చెప్పింది చేస్తారని బీసీ సంక్షేమ, సమాచార శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ చెప్పారు. కాకినాడ జిల్లా రామచంద్రాపురంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ చేయగలిగిందే చెప్తారని ప్రజలు విశ్వసిస్తున్నట్లు తెలిపారు. దీనికి వాస్తవ రూపంగానే రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతోందన్నారు. పార్టీ మేనిఫెస్టోను భగవద్గీతగా, ఖురాన్‌గా, బైబిల్‌గా ముఖ్యమంత్రి జగన్ భావించారని చెప్పారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఇలాంటి పథకాన్ని ప్రకటించి దాదాపు 17 వేలమందికిపైగా జంటలకు ఏ లబ్ధి చేకూర్చలేదని విమర్శించారు. సుమారు 68 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి దిగిపోయాడని మండిపడ్డారు.

చంద్రబాబు 2014 టీడీపీ మేనిఫెస్టోలో 600కు పైగా హామీలు ఇచ్చి, వాటిని పూర్తిగా ఎగ్గొట్టిన ఘనుడన్నారు. ఇవ్వడానికే హామీలు గానీ, అమలు చేయడానికి కాదు అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరించారని విమర్శించారు. ప్రజలు అడగరని, ఎన్నికల తర్వాత వారికి గుర్తుండదని, మరచిపోతారన్నది చంద్రబాబు భావనగా పేర్కొన్నారు. ఆయనకు మనస్సాక్షి అనేదే లేదన్నారు. ఆయన హయాంలో మొత్తం రాజకీయ వ్యవస్థపైనే నమ్మకం సడలిపోయిందని చెప్పారు. రాజకీయాల్లో విశ్వసనీయత, పారదర్శకత తీసుకు వచ్చిన నాయకుడు జగన్‌ అన్నారు.

జగన్ అంటే ఒక నిజం అని పేర్కొన్నారు. చంద్రబాబు రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఎగ్గొట్టారని విమర్శించారు. ఒకవైపు చంద్రబాబు చేసిన అప్పుల భారాన్ని మోస్తూ మరోవైపు వైఎస్‌.జగన్‌ సంక్షేమాన్ని, అభివృద్ధిని రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారన్నారు. పరిపాలనా రాజధానిగా విశాఖను చేయాలన్నదే తమ ప్రభుత్వ నిర్ణయంగా పేర్కొన్నారు. అమరావతి రైతుల పాదయాత్రలో ఎక్కడైనా ఏదైనా జరగకూడని ఘటనలు జరిగితే దానికి చంద్రబాబే బాధ్యత వహించాలని చెప్పారు.

  Last Updated: 11 Sep 2022, 09:18 PM IST