Chandrababu Bail : ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై మరిన్ని షరతులు విధించాలంటూ సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై శుక్రవారం ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కేసు అంశాలపై మీడియాతో మాట్లాడొద్దని చంద్రబాబుకు సూచించింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను పక్కాగా అమలు చేయాలని పేర్కొంది. రాజకీయ ర్యాలీలలో పాల్గొనకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలు అమల్లో ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే చంద్రబాబు బెయిల్పై ఉన్నన్ని రోజులు, రోజువారీ కార్యకలాపాలను పరిశీలించేందుకు ఇద్దరు సీఐడీ డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్పై బుధవారం వాదనలు ముగించిన హైకోర్టు.. ఇవాళ తీర్పు వెల్లడించింది.
We’re now on WhatsApp. Click to Join.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాం కేసులో చంద్రబాబుకు మంగళవారం రోజున హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో పాటుగా కంటికి ఆపరేషన్ చేయాల్సి ఉందని చంద్రబాబు తరఫు లాయర్లు.. రెగ్యులర్ బెయిల్కు అనుబంధంగా మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. నాలుగు వారాల పాటూ బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం తీర్పు(Chandrababu Bail) ఇచ్చింది.