హైకోర్టు రూపంలో ఏడుకొండలవాడు ముఖ్యమంత్రి జగన్ కు మరోసారు మొట్టికాయ వేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల జంబో మండలి నియామకాన్ని హైకోర్టు రద్దు చేసింది. ప్రత్యేక ఆహ్వానితులుగా 52 మందిని నియమిస్తూ జారీ చేసిన జీవోను కొట్టిపారేసింది. ఏపీ దేవాదాయ శాఖ చట్టం ప్రకారం 24 మంది మాత్రమే మండలి ఎంపికకు అర్హులు. కానీ, మిగిలిన 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ జారీ చేయడం చెల్లదని స్పష్టం చేసింది. ప్రమాణస్వీకారం చేయకుండానే అనర్హులుగా 52 మంది సభ్యులు మిగిలిపోయారు. ఇది, ఏడుకొండలవాడి ఆగ్రహంగా భక్తులు భావిస్తున్నారు.
ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 568, 569 లను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఎండోమెంట్ యాక్ట్ 1987లోని ఆర్టికల్ 25 ప్రకారం జీవోలు చెల్లవని తేల్చేసింది. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఒత్తిడి మేరకు సభ్యులను ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. మండలి కమిటీ సభ్యుల ఎంపికకు ముందుగానే లీగల్ సమస్య రాకుండా చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు జీవో విడుదల అయింది.
చైర్మన్ నియామకం అయిన తరువాత కొన్ని వారాలకు ధర్మకర్తల మండలి సభ్యుల్ని ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఎంపికైన సభ్యుల్లో చాలా మంది నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. కొందరు మనీ ల్యాండరింగ్ కేసులు ఇంకొందరు క్రిమినల్ కేసులను ఫేస్ చేస్తున్నారు. హిందూ సంప్రదాయాలు, ఏడుకొండల స్వామి ప్రాశస్త్యం తెలియని వాళ్లను నియమించారు. ఆ విషయాన్ని హిందూ సంఘాలు, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వెలుగెత్తి చాటాయి. బీజేపీ లీడర్ ప్రకాష్రెడ్డి, హిందూ భక్తులు కలిసి ధర్మకర్తల మండలి ఎంపికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు.
అత్యవసర పిటిషన్ ను విచారించిన హైకోర్టు ధర్మకర్తల మండలి నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ ఫుల్ బెంచ్ లో పిటిషన్ వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నాలుగు వారాల తరువాత మాత్రమే పై బెంచ్ లో వాదనలు వినిపించడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంది. అప్పటి మధ్యంతర ఉత్తర్వులను అమలు చేయక తప్పని పరిస్థితి. సో…ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపికైన బడా బాబులు, నేరారోపణలు ఎదుర్కొంటోన్న సభ్యులు ప్రస్తుతం డీలా పడ్డారు.