హత్యలు చేసిన వారికే ఆరు నెలలు తిరగకముందే బెయిల్ వస్తున్న ఈరోజుల్లో..పాపం శ్రీనివాస్ (Kodi Kathi Srinivas bail) కోడి కత్తి దాడి లో ఐదేళ్ల కు బెయిల్ వచ్చింది. 2018, అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు కోడి కత్తి తో దాడి చేసాడు. ఈ దాడి కేసులో శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ పై కొద్ది రోజుల క్రితం న్యాయస్థానం విచారణ చేపట్టింది. జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా విచారణ ప్రక్రియ ఆలస్యం అయ్యేలా చేస్తున్నారని.. దీంతో నిందితుడు ఏళ్ల తరబడి జైల్లోనే మగ్గుతున్నాడని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఓ హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంతకాలం జైల్లో ఉండడం సరికాదని న్యాయస్థానానికి వివరించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. ఇటీవల తీర్పును రిజర్వ్ చేసింది. ఇక ఈరోజు నిందితుడు శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు ఐదేళ్ల తర్వాత అతడికి బెయిల్ లభించగా.. కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని కోర్టు ఆంక్షలు విధించింది. ప్రతి ఆదివారం ముమ్మిడివరం పీఎస్లో హాజరుకావాలని.. రూ.25వేల పూచీకత్తు, 2 ష్యూరిటీలు సమర్పించాలంది. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కుటుంబ సభ్యులు, దళిత, పౌర సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
We’re now on WhatsApp. Click to Join.
రీసెంట్ గా శ్రీనివాస్ ను విడుదల చేయాలంటూ అతని తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు ఇటీవల విజయవాడలో నిరాహార దీక్షకు సైతం దిగారు. తన తమ్ముడ్ని అడ్డుపెట్టుకుని జగన్ ఎన్నికల్లో సీఎం అయ్యారని, దళితుడు అనే కారణంతో అందరూ వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా జైల్లో మగ్గిపోతున్నాడని తల్లి సావిత్రి కన్నీటి పర్యంతమయ్యారు. అతడికి ఏమవుతుందోనని భయంగా ఉందన్నారు. గత ఐదు సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్నాడని…ఏపీ సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం లేదని వాపోయారు. అయితే, ఆమె ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు దీక్ష భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు. మొత్తం మీద ఎన్నికల ముందు అరెస్ట్ అయ్యి..కరెక్ట్ గా ఇప్పుడు ఎన్నికల సమయానికి బెయిల్ ఫై బయటకు వస్తున్నాడు శ్రీనివాస్.
Read Also : TS : ‘ధనిక రాష్ట్రంగా అప్పగిస్తే.. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది’ – గవర్నర్ తమిళసై