ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఓ కీలక విషయాన్ని తెలియజేసింది. విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు కారుణ్య నియామాకాలను కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల ఆధారంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విధి నిర్వహణలో మరణించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరిలో ఒకరికి ఉపాధి కల్పించేందుకు కారుణ్య నియామకాలకు అనుమతిస్తూ గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పలు కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల ఆధారంగా కారుణ్య నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో మరణించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించినందుకు సీఎం వైఎస్ జగన్కు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.