ప్రముఖ కార్పొరేట్ సంస్థ ఐటీసీతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసి అడుగు వేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు ఉపయోగపడే టెక్నాలజీని ఆ కంపెనీ నుంచి తీసుకుంటున్నారు. ఆ క్రమంలో పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని వంకాయలపాడు వద్ద గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ఐటీసీ నిర్మించింది. దాన్ని శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ యూనిట్ ను ఐటీసీ సంస్థ రూ. 200 కోట్లతో నిర్మించింది. సుమారు 6.2 ఎకరాల స్థలంలో సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి, ఎగుమతి చేసే చేయడానికి ఈ పార్క్ రూపుదిద్దుకుంది.
యూనిట్ ను ప్రారంబించిన తరువాత జగన్ మాట్లాడుతూ 14 వేల మంది రైతులకు అది ఉపయోగపడుతుందని వెల్లడించారు. రెండో దశ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు కూడా ఐటీసీ ప్రణాళికలను సిద్ధం చేస్తోందని సీఎం అన్నారు. ఈ యూనిట్ ద్వారా రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుందని ఆశిస్తున్నారు. రైతులను చేయిపట్టి నడిపించే బాధ్యతను ఐటీసీ తీసుకుందని కొనియాడారు.
రాష్ట్రాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా విప్లవాత్మక మార్పులు వ్యవసాయంలో వస్తున్నాయని జగన్ గుర్తు చేశారు. ఆర్బీకే విధానం ద్వారా రైతుల జీవితాల్లో మార్పును తీసుకొస్తున్నామని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత మూడేళ్లుగా ఏపీ తొలి స్థానంలో నిలిచిందని సీఎం అన్నారు. రైతులు లాభాల బాటన నడిచేలా ఆర్బీకేలు పనిచేయడాన్ని ప్రశంసించారు. వీటి పనితీరుకు ఐటీసీ సాంకేతిక పరిజ్ఞానం కూడా తోడు కావడంతో ఇక తిరుగుండదని జగన్ భావిస్తున్నారు.