ఏపీలో అమూల్ డెయిరీ తన సంస్థను విస్తరించేందుకు ఏపీ ప్రభుత్వంతో చేతులు కలిపింది.గుజరాత్ కు చెందిన అమూల్తో జగన్ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇది ప్రవేట్ డెయిరీ అయినప్పటికీ గ్రామాల్లో మాత్రం ప్రభుత్వడెయిరీ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఏపీలో పాడిరైతుల సహాకార సంఘాల ద్వారా పాల సేకరణ జరుగుతుంది.దీనికి తోడు పలు ప్రవేట్ డెయిరీలు సైతం రాష్ట్రంలో ఉన్నాయి.అయినప్పటికీ ప్రభుత్వం గుజరాత్ కి చెందిన అమూల్ ఒప్పందం కుదుర్చుకోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. పాల ఉత్పత్తిలో ఇప్పటికే విజయ డెయిరీ, సంగం,హెరిటేజ్, జెర్సీ వంటి సంస్థలు అద్భుతమైన సేవలు కొనసాగిస్తున్నాయి. అయితే వీటిని దెబ్బతీసేందుకు ప్రభుత్వం అమూల్ తో ఒప్పందం చేసుకుందని వాదన వినిపిస్తుంది.
మరో వైపు లక్షా యాభైవేల పాడి రైతుల కుటుంబాలు కలిగిన కృష్ణామిల్క్ యూనియన్(విజయ) గ్రామాల్లో అనేక పథకాలను ప్రవేశపెడుతుంది. పాడిరైతుల కుటుంబాల్లో వివాహాలు జరిగితే 20వేల రూపాయల బంగారు నాణేన్ని అందజేస్తుంది.పాడిరైతులు చనిపోతే 50వేల రూపాయలను ఆ కుటుంబానికి అందిస్తుంది.ఇదే కాక రైతుల కుటుంబాల్లో ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.మరోవైపు మూడు నెలలకొకసారి బోనస్ ఇస్తున్నారు.ఇది ఇలా ఉంటే అమూల్ కి పాలు పోయించడం కోసం అధికారులు గ్రామాలకు పరుగులు తీసుస్తున్నారు. జిల్లా, మండల,గ్రామ స్థాయిలో అధికారులకు అమూల్ కి పాలు పోయించే బాధ్యతలను అప్పగించారు. దీంతో వారంతా ఉదయం నుంచి రాత్రి వరకు గ్రామాల్లోనే తిరుగుతున్నారు. కొన్ని మారుమూల గ్రామాల్లో ఒక్క రైతు కూడా పాలు పోయకపోవడంతో జిల్లా స్థాయిలో అధికారులు పరుగెత్తుకుంటూ ఆ గ్రామాలకు పోయి అక్కడి వారితో మాట్లాడుతున్నారు. ఎంతమంది అధికారులు వచ్చిన కొన్ని గ్రామాల్లో అమూల్ కి పాలుపోసేందుకు ముందుకు రావడంలేదు.ఆర్డీవో,ఎమ్మార్వో, పంచాయతీ కార్యదర్శులు అమూల్ డెయిరీల దగ్గరే పడిగాపులు కాస్తున్నారు.
అమూల్ డెయిరీకి పాలు పోయించడంలో నిర్లక్ష్యంగా ఉన్నారని వారిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమూల్ డెయిరీకి పాలు పోయించడం లేదని గుంటూరు జిల్లాలో 12 మంది పంచాయతీ కార్యదర్శులకు జిల్లా పంచాయితీ అధికారి కేశవరెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అమూల్ డెయిరీకి పాలు పోయడానికి రైతులు ఒప్పుకోవడం లేదని, దానికి మేమేం చేస్తామని, ఇష్టంలేనివారిచేత బలవంతంగా ఎలా పాలుపోయిస్తామంటూ పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమూల్ డెయిరీకి పాలు పోయించడానికి నోడల్ అధికారులుగా జిల్లావ్యాప్తంగా పంచాయితీ కార్యదర్శులను నియమించారు. గుంటూరు జిల్లాలో అగ్రగామిగా ఉన్న సంగం డెయిరీని దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అమూల్ విషయంలో ప్ఱభుత్వ అధికారులు అసంతృప్తిగా ఉన్నారు.తామే చేయాల్సిన ఉద్యోగం కంటే దీనికి ఎక్కువ చేస్తున్నామని…పాలు పోయమని అడిగితే రైతులు నుంచి చివాట్లు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్కతున్నారు.