ఓట్ల కోసం ఉద్యోగుల అడుగులకు మడుగులొత్తిన ప్రభుత్వాలను చూశాం. అత్యాశకు పోతోన్న కొందరు ఏపీ ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం 30శాతం ఫిట్మెంట్ తెలంగాణ ఉద్యోగులకు ఉంది. ఏపీ ఉద్యోగులకు గత పీఆర్సీ ప్రకారం 27శాతం ఫిట్ మెంట్ ఉంది. ఒక వేళ తెలంగాణ ఉద్యోగుల మాదిరిగా 30శాతం ఫిట్మెంట్ చేయాలంటే ..కనీసం 1200 కోట్ల భారం పడనుంది. ఒక శాతం ఫిట్మెంట్ పెంచితే 400కోట్లకు పైగా భారం పడుతుందని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఫిట్మెంట్ తో పాటు 71 డిమాండ్లను ఏపీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు ఉంచాయి. వాటిని పరిశీలిస్తోన్న జగన్ సర్కార్ రెండు వారాల్లో ప్రకటిస్తుందని రాజకీయ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి అంటున్నారు. అదే జరిగితే ఏదో ఒక రూపంలో పన్నులు భరించడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలి.
జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తరువాత పలు మార్గాల ద్వారా 18వేల కోట్ల రూపాయాల అదనపు బెనిఫిట్స్ ను ఉద్యోగులు పొందారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కొత్త ఉద్యోగాల నియామకంగానీ, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం తదితరాల రూపంలో వేల కోట్లు ఉద్యోగుల జేబుల్లోకి వెళ్లాయి. పైగా రెండేళ్లుగా పనిలేకుండా జీతాలను తీసుకుంటున్నారు. కోవిడ్ కారణంగా ఇళ్ల నుంచి బయటకు రాకుండా లక్షలాది రూపాయల జీతం జేబుల్లో వేసుకున్నారు. ఇవన్నీ తెలిసీ కూడా కొందరు ఉద్యోగులు, ఉద్యోగ సంఘం నాయకులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తమ 71 డిమాండ్లను నెరవేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.
టీచర్లు, ఆర్టీసీ ఉద్యోగులు కోవిడ్ సందర్భంగా విధులను నిర్వర్తించలేకపోయారు. అయినప్పటికీ జీతాలను ఏ మాత్రం కోతలేకుండా జగన్ ప్రభుత్వం ఇచ్చింది. సామాన్యులు మాత్రం రోడ్డున పడ్డారు. తినడానికి తిండి లేకుండా పోయింది. రైతులకు పంట నష్టం వాటిల్లింది. వ్యవసాయ దారులు, కూలీలు, ప్రైవేటు రంగం ఉద్యోగులకు ఉపాథి లేకుండా పోయింది. కూడు, గుడ్డ, నీడకు నోచుకోలేని లక్షలాది మంది పేదల గురించి ఉద్యోగులు ఆలోచించకపోవడం దారుణం. వాళ్లకు ప్రభుత్వంలోని సలహాదారుగా ఉన్న సజ్జల రామక్రిష్ణారెడ్డి మద్ధతు పలకడం ఘోరం.
ప్రభుత్వాలను కూల్చగలం, నిలబెట్టగలం అనే స్థాయికి వెళ్లిన ప్రభుత్వ ఉద్యోగ సంఘాల పట్ల ఇంకా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందంటే వాళ్లంటే ఎంత భయమో అర్థం అవుతోంది. రెండున్నరేళ్లుగా రాజద్రోహం కేసులు సామాన్యుల మీద పెట్టిన జగన్ సర్కార్ ఉద్యోగ సంఘ నేతల వ్యాఖ్యలను సీరియస్ గా పట్టించుకోకపోవడం దివాళాకోరుతనమే అవుతుంది.
సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి బాధ్యతాయుతంగా ఆలోచిస్తూ..ఉద్యోగుల జీతాలను పెంచకుండా ఉండే మార్గాన్ని ఆలోచిస్తున్నాడు. కానీ, సలహాదారుడుగా ఉన్న రామక్రిష్ణారెడ్డి మాత్రం ఉద్యోగులకు వస్తాసు పలుకుతూ సామాన్యులపై భారం వేసే ధోరణిలో ఆలోచిస్తున్నాడని ఆ పార్టీలోని వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు సజ్జలకు తెలుసు. మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇస్తోన్న పీఆర్సీని ఏపీ ప్రభుత్వం ఎలా భరించగలదో ఆలోచించాలి. ఉద్యోగులు ఆడిందే ఆట..పాడిందే పాటగా ప్రభుత్వాలు వత్తాసు పలికితే..రాబోవు రోజుల్లో ఆర్థిక ఎమర్జెన్సీ తప్పని పరిస్థితికి వెళ్లాలి. ఇప్పటికైనా ఉద్యోగులు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. సలహాదారులు బెహర్భానీకి వెళ్లకుండా నిజాలను తెలియచేయాలి. లేదంటే, ప్రతిపక్షం డిమాండ్ చేస్తోన్న విధంగా రాష్ట్రపతి పాలన అనివార్యంగా మారే ప్రమాదం లేకపోలేదు.