AP ACB – Bumper Offer : ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కీలక ప్రకటన చేసింది. లంచం డిమాండ్ చేసే ప్రభుత్వ సిబ్బంది, అధికారులపై సమాచారాన్ని అందిస్తే క్యాష్ ప్రైజ్ ఇస్తామని వెల్లడించింది. రూ.5వేల నుంచి రూ.10వేల దాకా నగదు బహుమతిని అందిస్తామని తెలిపింది. ఇటువంటి సమాచారం ఉన్నవారు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 14400కు కాల్ చేయాలని కోరింది. అయితే కేవలం ఫిర్యాదు చేస్తే సరిపోదని, సరైన ఆధారాలను కూడా ఇవ్వాలని పేర్కొంది. పక్కా ఆధారాలతో లంచగొండులను పట్టించిన వారికి గరిష్ఠంగా రూ.10వేల దాకా క్యాష్ ప్రైజ్ ఇస్తామని స్పష్టం చేసింది.
కలెక్టరేట్, ఆర్డీఓ ఆఫీస్, విద్యుత్ శాఖ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు, ఎంపీడీవో, ఎమ్మార్వో ఆఫీస్, పోలీసు స్టేషన్, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఆఫీసు ఇలా ఎక్కడ పనిచేసే సిబ్బంది లంచం అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అర్జీ రూపంలో ఫిర్యాదు చేసినా స్వీకరిస్తామన్నారు. ఏపీ ఏసీబీ మొబైల్ యాప్ ద్వారా, 8333995858 వాట్సాప్ నంబర్ ద్వారా, dg_acb@ap.gov.in అనే మెయిల్ ఐడీకి కూడా ఫిర్యాదులను పంపొచ్చని (AP ACB – Bumper Offer) వివరించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు సీక్రెట్ గా ఉంచుతామని పేర్కొన్నారు.