AP Governor – Chandrababu : టీడీపీ చీఫ్ చంద్రబాబుపై పలు వ్యాఖ్యలు చేసిన సీఐడీ చీఫ్ సంజయ్, రాష్ట్ర అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి పై ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదులు అందాయి. దీంతో వీరిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ.. ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి గవర్నర్ లేఖ రాశారు. సీఐడీ చీఫ్, అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా కొనసాగుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై పక్షపాత ధోరణితో మాటలు మాట్లాడారనే ఆరోపణలతో తనకు ఫిర్యాదులు అందాయని లేఖలో పేర్కొన్నారు. గత నెల 23న సత్యనారాయణ అనే ఆర్టీఐ కార్యకర్త ఈ వ్యవహారంపై గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కేసులో సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు హైదరాబాద్ వేదికగా మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఆ మీటింగ్ లోనే వారు చంద్రబాబు పై పక్షపాత దోరణితో వ్యాఖ్యలు చేశారంటూ ఒక ఫిర్యాదు ఏపీ గవర్నర్ కు అందింది. ఇటీవల గవర్నర్ ను కలిసిన టీడీపీ నేతల బృందం కూడా ఈవిషయాన్ని ఆయనకు వివరించింది. వైసీపీ ప్రభుత్వ తీరుపై గవర్నర్ కు 50 పేజీల నివేదికను (AP Governor – Chandrababu) సైతం అందించింది.