సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ మరో నాలుగు రోజుల్లో రిటైర్ కాబోతున్నారు. దీంతో రెండేళ్లుగా పదవి కోసం ఎదురుచూస్తున్న ఆమెకు ప్రభుత్వం ఊరట కల్పించింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ పదవిని అప్పగించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆమె గౌరవంగా తన కెరీర్కు ముగింపు పలకనున్నారు. సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం ఆలిండియా అధికారులు సస్పెన్షన్లో లేకపోతే, ఏదో ఒక పోస్టింగ్ ఇచ్చి గౌరవంగా రిటైరయ్యే అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పించాల్సి ఉంటుంది. ఈ రూల్ ప్రకారమే ప్రభుత్వం ఐఏఎస్ శ్రీలక్ష్మీకి పదవిని ఇచ్చింది. తద్వారా ఆమె సర్వీస్ను గౌరవించడంతో పాటు.. తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదనే సంకేతాలు పంపింది. ఈ నిర్ణయంతో ఆలిండియా ర్యాంక్ అధికారుల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత పెరిగే అవకాశం ఉంది.
సీనియర్ అధికారులు ఆరోపణలను ఎదుర్కోవాల్సి రావడం, దీంతో సస్పెన్షన్కు గురికావడం లేదా పోస్టింగ్ కోసం ఎదురుచూడాల్సి రావడం అనేది ఇటీవలి కాలంలో అరుదైన విషయమేం కాదు. రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర రావు సైతం పదవీ విరమణకు ఒక్క రోజు ముందు ప్రింటింగ్, స్టేషనరీ డీజీగా జగన్ సర్కారు బాధ్యతలు అప్పగించింది. అయితే ఇందుకోసం ఆయన న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది.
సీనియర్ ఐఏఎస్లు కేఎస్ జవహర్ రెడ్డి, పూనం మాలకొండయ్య లాంటి వారికి సైతం రిటైర్మెంట్ ముంగిట ఇలాగే పోస్టింగ్లు లభించాయి. జగన్ సర్కారుకు అనుకూలంగా పని చేశారనే ఆరోపణలు గతంలో వీరిపై టీడీపీ, జనసేన నేతలు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం రెండేళ్ల క్రితం రిటైర్మెంట్ ముంగిట వీరికి పోస్టింగ్లు ఇచ్చి హుందాగా వ్యవహరించింది.
ఏ అధికారి అయినా ఒక పోస్టులో ఉండి రిటైర్ అయితే పదవీ విరమణ అనంతరం దక్కే ప్రయోజనాలు పొందేందుకు పెద్దగా చిక్కులు ఎదురవవు. సర్వీస్లో యాక్టివ్గా ఉండి రిటైర్ అయితే నో డ్యూ సర్టిఫికెట్లు పొందడం, పెన్షన్ మంజూరు కావడం సులభం అవుతుంది. ఒకవేళ లూప్ లైన్లో ఉండి లేదా సస్పెన్షన్లో ఉండగానే రిటైర్ అయితే మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి.
ఒక అధికారిపై తీవ్రమైన అవినీతి లేదా క్రిమినల్ ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రమే సస్పెండ్ చేస్తారు. సస్పెన్షన్లో ఉండగానే రిటైర్ అయితే పూర్తి స్థాయి పెన్షన్ లభించదు, తాత్కాలిక పెన్షన్ మాత్రమే లభిస్తుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ను సైతం ప్రభుత్వం హోల్డ్లో పెడుతుంది. శాఖపరమైన విచారణలు లేదా కోర్టు తీర్పు వచ్చి, సదరు అధికారి నిర్దోషిగా తేలేంత వరకు ఈ బెనిఫిట్స్ విడుదల కావు. విచారణలో ఆ అధికారికి వ్యతిరేకంగా తీర్పు వస్తే.. పెన్షన్లో శాశ్వతంగా కోత పడే అవకాశం ఉంది.
సస్పెన్షన్లో లేకుండా, పోస్టింగ్ కూడా లేకుండా రిటైర్ అయితే ఆర్థిక ప్రయోజనాల పరంగా వచ్చే నష్టమేమీ ఉండదు. కాకపోతే నో డ్యూ సర్టిఫికేట్, లాస్ట్ పే సర్టిఫికేట్ పొందడంలో జాప్యం కారణంగా పేపర్ వర్క్ ఆలస్యం అవుతుంది. దీనివల్ల ఫైల్స్ క్లియర్ చేయించుకోవడం కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అలాగే పోస్టింగ్ లేకుండా రిటైర్ కావడం అనేది సదరు అధికారికి అవమానకరంగా ఉంటుంది. అందుకే కెరీర్ చివరి రోజుల్లో సస్పెన్షన్ లేదా ఎలాంటి పోస్టింగ్ పొందని ఆలిండియా అధికారులు గౌరవప్రదంగా రిటైర్ కావడం కోసం.. క్యాట్ లేదా కోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తుంటారు. ఐఏఎస్ శ్రీలక్ష్మీ విషయంలో ప్రభుత్వం సానుకూల వైఖరి కనబర్చడం అనేది ఇరు వర్గాలకు ప్రయోజనకరమని చెప్పొచ్చు.
