అమరావతి : కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతమున్న కోవిడ్ పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశంలో టీకాలు వేసే ప్రక్రియను వేగవంతం చేయాలని, లక్ష్యాలను నిర్ధేశించి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మాస్క్ల వాడకంపై డ్రైవ్ను ప్రారంభించాలని…సామూహిక సమావేశాలు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి ఫీవర్ సర్వే, టీకాలు వేయడం కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. గతంలో కోవిడ్ రోగులకు చికిత్స అందించిన ఆసుపత్రుల్లోని సౌకర్యాలను పరిశీలించాలని, ఎంపానెల్డ్ ఆసుపత్రుల్లో సౌకర్యాలు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. క్వారంటైన్ సెంటర్లు, కోవిడ్ కేర్ సెంటర్లు, కోవిడ్ కాల్ సెంటర్లను మరోసారి తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు.
డిసెంబరు నెలాఖరులోగా రెండు కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులకు సీఎం జగన్ తెలిపారు. ప్రక్రియ మందగించిన జిల్లాలపై దృష్టి సారించాలని… అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల మాక్ డ్రిల్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లోని విమానాశ్రయాల్లో ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్కు వచ్చేవారిని పరీక్షించాలని… ఆర్టీపీసీఆర్ పరీక్షలు మాత్రమే నిర్వహించాలని, ర్యాపిడ్ పరీక్షలను నివారించాలని అధికారులకు తెలిపారు.
కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రబలుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ మరింత ఉధృతంగా చేయాలని ఆరోగ్యశాఖ అధికారులను సీఎం శ్రీ వైయస్జగన్ ఆదేశించారు. క్యాంప్ కార్యాలయంలో కోవిడ్, వైద్య, ఆరోగ్యశాఖపై నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ..1/2 pic.twitter.com/m5d2t3YI2c
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 29, 2021
ఆంధ్రప్రదేశ్లో రికవరీ రేటు 99.20, పాజిటివ్ రేటు 0.64గా ఉన్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. రోజువారీ సగటు కేసులు 197 కాగా మొత్తం యాక్టివ్ కేసులు 2,140 ఉన్నాయి. 104 నంబర్కు కాల్స్ తగ్గాయని, మూడో వేవ్ ని పరిష్కరించడానికి సన్నాహాలు చేశామని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. 8200 పడకలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నాయని… 87.43 శాతం మంది మొదటి డోస్ను పూర్తి చేశారని, 62.19 శాతం మంది రెండు డోస్లను పూర్తి చేశారని, జనవరి నాటికి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని వారు తెలిపారు.
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మ్యుటేషన్లోకి వచ్చి వేగంగా వ్యాప్తి చెందుతోందని…ఈ వేరియంట్పై వివిధ దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయని వారు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ వేరియంట్ను గుర్తించేందుకు జీనోమిక్ సీక్వెన్స్ కోసం 15 శాతం శాంపిల్స్ను సీసీఎంబీకి పంపుతున్నామని…త్వరలో విజయవాడలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ అందుబాటులోకి వస్తుందని వారు తెలిపారు. దక్షిణాఫ్రికా, బోట్స్వానా, హాంకాంగ్ల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు.