Adani group announced donation of 25 crore : ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో ఏపీ అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. అయితే ఏపీకి సాయం చేసేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. అదానీ ఫౌండేషన్ రూ. 25 కోట్లు సాయం ప్రకటించింది. ఈ మేరకు గౌతమ్ అదానీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. అపార నష్టం చవిచూసిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకునేందుకు తమవంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. సంబంధిత పత్రాలను ఏపీ సీఎం చంద్రబాబుకు సంస్థ ఎండీ కరణ్ అదానీ అందజేస్తున్న ఫొటోను షేర్ చేశారు. కాగా, ఏపీ వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సహా వ్యాపారవేత్తలు సైతం ముందుకొస్తున్నారు. సీఎం సహాయ నిధికి (CMRF) తమ వంతు విరాళం అందిస్తున్నారు. తాజాగా, వరదలతో అల్లాడిన ఏపీకి సాయం చేసేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది.
Deeply troubled by the extensive damage caused by the recent torrential rains and flooding in Andhra Pradesh. The Adani Group stands in solidarity with the people of Andhra Pradesh and humbly extend our support through the @AdaniFoundation with a contribution of Rs 25 Cr to the… pic.twitter.com/FoRvCmY8GY
— Gautam Adani (@gautam_adani) September 19, 2024
మరోవైపు, సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. వరద బాధితుల సహాయార్థం స్టీల్ ఎక్స్ఛేంజ్ ఇండియా లిమిటెడ్ తరఫున రూ.50 లక్షలను సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు అందించారు. అలాగే, ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రజల నుంచి సేకరించిన రూ.35 లక్షలను సీఎంకు అందజేశారు. వరద బాధితుల కోసం గుంటూరుకు చెందిన గడ్డిపాటి సుధాకర్ దంపతులు రూ.20 లక్షలు, ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ ప్రతినిధులు రూ.10 లక్షలు, 108 ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.10 లక్షలు, ఏపీఎస్ఆర్టీసీ హైర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ రూ.24 లక్షలు, మత్స్యకారుల సంక్షేమ సంఘం తరఫున రూ.6 లక్షలు, మల్లవల్లి ఇండస్ట్రీస్ రూ.14.50 లక్షలు, భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కంపెనీ తరఫున రూ.50 లక్షలు, రాజమండ్రి రూరల్ ప్రజలు అందించిన దాదాపు రూ.83 లక్షల చెక్కును ఎమ్మెల్యే సీఎం చంద్రబాబుకు అందజేశారు.