ఏపీ సర్కార్ కు అల్టిమేటం ఇవ్వడానికి ఉద్యోగులు(AP Employees)సిద్దమవుతున్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ సమావేశం అయ్యాయి. ఆ సమావేశానికి హాజరైన ఉపాధ్యాయ సంఘాల నేతలు అర్థాంతరంగా వెళ్లిపోవడం ఉద్యోగుల మధ్య చిచ్చును రేపింది. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సీపీఎస్ రద్దు కు ఉపాధ్యాయ సంఘాలు పట్టుబడుతున్నాయి. కానీ, కొన్ని సంఘాలు ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ ను మౌనంగా అంగీకరిస్తున్నాయి. సరిగ్గా ఇక్కడే ఉద్యోగుల మధ్య వార్ మొదలయింది.
ఉద్యోగ సంఘాలు ఒకప్పుడు ప్రభుత్వాలను గడగడలాడించేవి. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు అభ్యర్థించే దుస్థితికి వచ్చేశాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాలతో ఉద్యోగ సంఘాలు(AP Employees) ఛిన్నాభిన్నం అయ్యాయి. ఉద్యోగ సంఘాల లీడర్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు ఇతర రెడ్డి సామాజికవర్గం నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డి పక్షాన నిలుస్తున్నారు. కానీ, ప్రభుత్వం ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అందుకే, ఆయన మీద ఇటీవల పలు కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ ఆయనకు అండగా ఎవరూ నిలవలేదు. పైగా శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా ఆరోపణలకు దిగారు.
పలుమార్లు సీపీఎస్ రద్దు మీద సమావేశమైన మంత్రివర్గం ఉపసంఘం సాధ్యంకాదని తేల్చేసింది. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. అయినప్పటికీ ఉద్యోగులు రోడ్ల మీదకు ధర్నాలకు దిగారు. ఒకానొక సమయంలో విజయవాడ రోడ్లను ముట్టడించారు. దీంతో ఆనాడున్న డీజీపీ సవాంగ్ మీద వేటు పడింది. ప్రస్తుతం ఉన్న డీజీపీ రవీంద్రనాథ్ రెడ్డి ఉద్యోగుల(AP Employees) ఆటలను కట్టడీ చేస్తున్నారు. కీలక లీడర్ల మీద కేసులు పెట్టారు. వాళ్లను అదుపు చేసే ప్రయత్నం చేసి సఫలీకృతం అయ్యారు. ప్రస్తుతం సీపీఎస్ రద్దు కోసం డిమాండ్ చేస్తూ రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేసే ధైర్యం ఉద్యోగులు చేయలేకపోతున్నారు.
Also Read : AP Employees : జగన్ కు పాలాభిషేకం తెచ్చిన తంటా! మంత్రి ఛాంబర్ కు ఉద్యోగుల తాళం
జీపీఎస్ మాత్రమే ఇవ్వగలమని జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ చెబుతోంది. ఆ మేరకు అంగీకారం తెలపాలని ఒత్తిడి తెస్తుంది. అందుకే, అన్ని సంఘాల నేతల సమావేశం పెట్టారు. కానీ, ఉపాధ్యాయ సంఘాల నేతలు మాత్రం సమావేశాన్ని బాయ్ కట్ చేసి వెళ్లిపోయారు. కానీ, ఉద్యమించేందుకు మాత్రం ధైర్యం చేయడంలేదు. జీపీఎస్ ను అమలు చేసేలా జీవో రానుంది. ఉద్యోగులు అందరూ అంగీకరించేలా జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచించారని ఆయనకు మద్ధతు ఇస్తోన్న ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ఏమి చేసచ్తారు ? అనేది పెద్ద ప్రశ్న.
Also Read : AP employees : ఉద్యోగ సంఘాల్లో భారీ చీలిక, సూర్యనారాయణపై పోలీస్ వేట
గతంలో జరిగిన ఉద్యమాల్లో ఉపాధ్యాయ సంఘాల నేతలు కీలకంగా వ్యవహరించారు. వాళ్లను కట్టడీ చేసినప్పటికీ ఉద్యోగుల్లో మాత్రం అసంతృప్తి ఉంది. ప్రతి నెలా జీతాలు తీసుకోలేని దుస్తితికి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని అసహనం ఉంది. అంతేకాదు, ఫేస్ రికగ్నైజేషన్ పెట్టడం వాళ్లకు నచ్చడంలేదు. తాజాగా స్కూల్ వేళల్లో సెల్ ఫోన్లను వాడడానికి లేదని జీవోను జగన్ సర్కార్ ఇచ్చింది. ఇవన్నీ నచ్చని అంశాలు ఉపాధ్యాయుల కోణంలో ఉన్నాయి. వీటితో పాటు ఇప్పుడు సీపీఎస్ రద్దు హామీని వదిలేశారని ఆగ్రహిస్తున్నారు. అయినప్పటికీ ఉద్యోగ సంఘాల నేతల్లో ఐక్యత లేకపోవడంతో ఉద్యమాలు చేసే పరిస్థితి లేదు. అందుకే, జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉద్యోగులను కట్టడీ చేయగలిగారని సచివాలయ వర్గాల్లోని టాక్.