ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ఉత్కంఠ నెలకొందో తెలియంది కాదు. కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు రాజకీయ నేతలు సైతం ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. జూన్ 04 న ఈ ఫలితాలు వెల్లడి కాబోతుండడం తో అన్ని పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఈసారి కూటమి గెలుస్తుందా..? వైసీపీ గెలుస్తుందా..? అంటూ పెద్ద ఎత్తున లెక్కలు వేస్తున్నారు. ఇదే క్రమంలో ఎన్నికల ఫలితాలు ఏ సమయానికల్లా వస్తాయి..? ఎవరు అధికారంలోకి రాబోతున్నారో ఏ సమయానికి తెలుస్తుంది..? వంటి వివరాలను ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఢిల్లీ నిర్వచన సదన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ కు ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను గురించి వివరించారు. ఓట్ల లెక్కింపుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, ఫలితాలు వెంటవెంటనే ఇచ్చేలాగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 175 శాసనసభ నియోజకవర్గాలలో 111 నియోజకవర్గాలలో 20 రౌండ్ల లోపు, 61 నియోజకవర్గాల్లో 21 నుండి 24 రౌండ్ల లోపు ఫలితాలు వెలువడనున్నాయని తెలిపారు. ఒక మూడు నియోజకవర్గాలలో మాత్రం 25 రౌండ్లకు పైబడి ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక మెజారిటీ ఫలితాలు మధ్యాహ్నం రెండు గంటల్లోపే వస్తాయని, 111 నియోజకవర్గాలలో మధ్యాహ్న రెండు గంటల లోపు, మిగతా 61 నియోజకవర్గాలలో సాయంత్రం నాలుగు గంటల లోపు, మిగిలిన మూడు నియోజకవర్గాలలో సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇక పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం టేబుల్ లను పెంచి సకాలంలో బ్యాలెట్ లెక్కింపును కూడా పూర్తి చేస్తామని ముఖేష్ కుమార్ మీనా వివరించారు. మొత్తంగా రాత్రి 8 గంటల నుండి 9 గంటల లోపే అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
Read Also : Gambhir: టీమిండియా హెడ్ కోచ్ రేసులో గంభీర్.. ఈ మూడు కారణాలే సాయం చేశాయా..?