AP DSC 2024 : మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఏపీలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా..సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. ఈవిషయాన్ని ఏపీ విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ వేదికగా ప్రకటించింది. ఎలక్షన్ కమిషన్ నుంచి స్పష్టత వచ్చాకే పరీక్షల కొత్త తేదీలను (రివైజ్డ్ షెడ్యూలు) ప్రకటిస్తామని స్పష్టం చేసింది. పరీక్ష కేంద్రాల ఎంపిక కోసం ఆప్షన్ల నమోదుకు కొత్త షెడ్యూలు ప్రకారం అవకాశం కల్పిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. టెట్ ఫలితాలను కూడా ఆ తర్వాతే వెల్లడిస్తామని పేర్కొంది.
We’re now on WhatsApp. Click to Join
డీఎస్సీ పరీక్షలను(AP DSC 2024) వాయిదా వేయాలని తమకు వెయ్యికిపైగా ఫిర్యాదులు వచ్చాయని ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముఖేశ్కుమార్ మీనా ప్రకటించారు. అయితే ఇది తమ పరిధిలో ఉండదని.. కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతిస్తే వాయిదా వేస్తామన్నారు. రాష్ట్రంలో ఎన్నికల్ కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతోందని, ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందేనని తెలిపారు.
6100 ఉపాధ్యాయుల నియామకం కోసం ఏపీ డీఎస్సీ – 2024 నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలని భావించారు. డీఎస్సీని ఆపాలని అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు పోటెత్తినందున.. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోబోయే నిర్ణయం ఆధారంగా ఈ పరీక్షల తేదీలు డిసైడ్ అవుతాయి. కాగా, తెలంగాణలో టెట్ పరీక్షకు ఏప్రిల్ 10 వరకు అప్లై చేయొచ్చు. అభ్యర్థులు మే 15 నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.