YS Sharmila Vs YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ రిమోట్ కంట్రోల్ ఢిల్లీలో బీజేపీ చేతిలో, ఏపీలో భారతి చేతిలో ఉందని ఆమె విమర్శించారు. ‘‘రెండు ‘బీ’ల కంట్రోల్లో పనిచేస్తున్న జగన్.. నాపై విమర్శలు చేస్తుండటం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు రిమోట్ కంట్రోల్ ద్వారా నన్ను ఆపరేట్ చేస్తున్నారని చెప్పడం సరికాదు. నేను స్వేచ్ఛగా ఆలోచిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛగా పనిచేస్తున్నాను’’ అని షర్మిల స్పష్టం చేశారు. గత ఐదేళ్లుగా జగన్ను బీజేపీ ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేసిందని షర్మిల ఆరోపించారు. మోడీ ఏ బటన్ నొక్కితే.. ఆ పని చేస్తున్నది సీఎం జగనే అనే విషయం ఏపీ ప్రజలందరికీ తెలుసు అని ఆమె వ్యాఖ్యానించారు. గంగవరం పోర్టును అదానీకి ఇచ్చేయమని మోడీ చెప్పగానే.. ఆ ఆదేశాలను అమలు చేసింది జగనే కదా అని షర్మిల ప్రశ్నించారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘మహానేత వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో రిలయన్స్ హస్తం ఉందని ఆనాడు జగనే ఆరోపించారు. ఆ తర్వాత మోడీ బటన్ నొక్కగానే రిలయన్స్ కంపెనీకి చెందిన ఓ వ్యక్తికి వైఎస్సార్ సీపీ తరఫున రాజ్యసభ పదవి ఇచ్చింది జగనే కదా ?’’ అని షర్మిల అడిగారు. గత ఐదేళ్లలో ప్రతి బిల్లుకు ప్రధాని మోడీ రిమోట్ నొక్కుతుంటే.. జగన్ మద్ధతు ఇస్తూ వచ్చారని ఆమె చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ను వైఎస్సార్కు వారసుడిగా చెప్పాలా ? మోడీకి వారసుడిగా చెప్పాలా ? అని షర్మిల ప్రశ్నించారు. స్వయంగా నిర్మలాసీతారామన్ లాంటి వాళ్లే వైఎస్ జగన్.. మోడీకి దత్తపుత్రుడు అని చెబుతున్నారన్నారు.
జగన్ కేసుల నుంచి తప్పించుకునేందుకే ఆయా కేసుల చార్జ్షీట్లలో వైఎస్ఆర్ పేరును పెట్టారని షర్మిల(YS Sharmila Vs YS Jagan) ఆరోపించారు. తప్పు తాను చేసి.. ఆ తప్పును కాంగ్రెస్ పార్టీపైకి నెట్టడం వెనుక కుట్ర ఉందన్నారు. తాను ఓడిపోతానన్న బాధ జగన్కు ఉంటే.. అవినాష్రెడ్డిని ఎన్నికల పోటీ నుంచి తప్పించాలని షర్మిల కోరారు. చెల్లి అన్న ప్రేమ ఉంటే.. అవినాష్ను విత్డ్రా చేయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకాను ఓడించింది వైఎస్ అవినాష్రెడ్డి, భాస్కర్ రెడ్డి కాదా..? అని షర్మిల ప్రశ్నించారు. అవినాష్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇవ్వడంతోనే వైఎస్ బిడ్డ పోటీలోకి దిగుతోందని వైఎస్ షర్మిలరెడ్డి స్పష్టం చేశారు. చిన్నాన్నను చంపిన హంతకుడికి టికెట్ ఇచ్చారు కాబట్టే.. పోటీలో నిలిచినట్టు తెలిపారు.