2204 Crores – 53 Lakh Farmers : ఆంధ్రప్రదేశ్లోని 53.53 లక్షల మంది అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో రూ.2,204 కోట్లు జమయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో బటన్ నొక్కి ఈ నిధులను రైతుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు. 53.53 లక్షల మంది అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో రూ.4 వేలు చొప్పున డిపాజిట్ అయ్యాయి. రాష్ట్రంలో రైతు భరోసా నిధులు విడుదల చేయడం ఈ ఏడాది ఇది రెండోసారి. సొంత భూమి కలిగిన రైతన్నలతో పాటు కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు రైతు భరోసా కింద ఏటా రూ.13,500 సాయం అందిస్తున్నారు. గత నాలుగున్నరేళ్లలో మొత్తం రూ.33,209.81 కోట్లను రైతన్నలకు అందించారు. ఏటా మే నెలలో రూ.7,500, అక్టోబర్- నవంబరు టైంలో రూ.4,000, జనవరి – ఫిబ్రవరి టైంలో రూ.2,000 అందిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు హయాంలో పేదల గురించి ఆలోచించనే లేదు. చంద్రబాబు ఏది ముట్టుకున్నా స్కామే. మేం అలా కాదు. రైతులు ఇబ్బంది పడకూడదని ముందుగానే రైతు భరోసా నిధులు విడుదుల చేస్తున్నాం. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందో అర్థం కాదు. టీడీపీ పాలనలో స్కీములు తక్కువ.. స్కాముల ఎక్కువ నడిచాయి. వైసీపీ హయాంలో వ్యవసాయం, చదువులు, ఆరోగ్య రంగం వికసించింది. అన్ని రంగాల్లో కనీవినీ ఎరుగని మార్పులు తెచ్చాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం కూడా తెచ్చాం’’ అని వివరించారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు కూడా పంట నష్ట పరిహారం ఇస్తున్నామని జగన్ తెలిపారు. ఉచిత పంట బీమా కూడా అందుబాటులో ఉందన్నారు. రైతులపై పంటభీమా భారం లేకుండా పూర్తి ప్రీమియం బాధ్యతను ప్రభుత్వమే తీసుకుని బీమా రక్షణ అందిస్తోందని ఆయన చెప్పారు.
గత ప్రభుత్వంలో పంట బీమా క్లెయిమ్లు ఎప్పుడొస్తాయో, ఎంతొస్తాయో, ఎంతమందికి వస్తాయో తెలియని దుస్థితి ఉండేదని సీఎం జగన్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ-క్రాప్ డేటా ఆధారంగా శాస్త్రీయంగా పంట నష్టాలు అంచనా వేసి ఏ సీజన్ పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగా పరిహారం అందిస్తున్నామని వివరించారు. ‘‘మా ప్రభుత్వం ద్వారా మీ ఇంట్లో మేలు జరిగి ఉంటే.. మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలవండి’’ అని జగన్ (2204 Crores – 53 Lakh Farmers) కోరారు.