Govt Plots Registration : ఏపీలోని 30 లక్షల మందికిపైగా పేదలకు గుడ్ న్యూస్ ఇది. ప్రభుత్వ భూపంపిణీ పథకాల్లో భాగంగా వారికి ఇచ్చిన ఇళ్ల స్థలాలను ఇక రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ మేరకు ‘1977 అసైన్డ్ భూముల చట్టాన్ని’ వైఎస్ జగన్ సర్కారు సవరించింది. దీనిపై ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది. దీంతో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు.. వారి ఆస్తిగా మారనున్నాయి. ప్రభుత్వం ఆ స్థలాలను లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి, కన్వేయన్స్ డీడ్స్ జారీ చేయనుంది. రోజు నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని(Govt Plots Registration) ప్రారంభిస్తోంది.
పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదలకు ప్రభుత్వం 30.65 లక్షల ఇళ్ల స్థలాలను పంపిణీ చేసింది. ఆయా స్థలాల రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎట్టకేలకు మార్గం సుగమం అయింది. పేదలు ఇక వాటిపై బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు కూడా పొందొచ్చు. ఇళ్ల స్థలాలను లబ్ధిదారుల పేరు మీద రిజిస్టర్ చేసేందుకు ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే వీఆర్వోలను ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. ఈమేరకు జీవో నంబర్ 36ను జారీ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
పేదలకు గతంలో సర్కారు ఇచ్చిన ఇళ్ల స్థలాల పట్టాలపై వారికి హక్కులు లభించడానికి 20 ఏళ్ల గడువు ఉండేది. 2021లోనే ఏపీ ప్రభుత్వం ఈ గడువును పదేళ్లకు తగ్గించింది. ఇప్పుడు లేటెస్టుగా ‘1977 అసైన్డ్ భూముల చట్టాన్ని’ వైఎస్ జగన్ సర్కారు సవరించింది. దీంతో ఇళ్ల పట్టాలను ఇచ్చినప్పుడే పేదల పేరు మీద వాటిని రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలు కలిగింది. రిజిస్టర్ అయిన వెంటనే వారికి కన్వేయన్స్ డీడ్స్ జారీ చేయడం వల్ల పదేళ్ల తర్వాత ఎవరి ప్రమేయం లేకుండా ఆ స్థలాలపై వారికి పూర్తి హక్కులు వస్తాయి. తహసీల్దార్ల నుంచి ఎన్వోసీ కూడా అవసరం ఉండదు. ఎందుకంటే ఆ స్థలాలు వారి పేరు రిజిస్టరై ఉండడం, కన్వేయన్స్ డీడ్లు కూడా ఇవ్వడంతో వాటిని ఆస్తిపత్రాలు (సేల్ డీడ్)గా వినియోగించుకోవచ్చు. ఇళ్ల పట్టాలను మహిళల పేరు మీద ఇచ్చి రిజిస్ట్రేషన్ కూడా వారి పేరు మీదే చేస్తారు.