ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ బీజీ షెడ్యూల్ లో ఉన్నారు. ఆయన ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. ఉదయం 10.30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయిన జగన్, రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై సుమారుగా అరగంట పాటు చర్చలు జరిపారు. ఆ తర్వాత ప్రధాని నివాసం నుంచి నేరుగా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ వద్దకు వెళ్లారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలపై కేంద్ర మంత్రితో చర్చించిన ఆయన తెలంగాణ నుంచి తమకు రావాల్సిన విద్యుత్ బకాయిలు ఇప్పించాలని కోరినట్టు తెలుస్తోంది.
ఆర్కే సింగ్ తో భేటీ తర్వాత సోమవారం మధ్యాహ్నం సమయంలో రాష్ట్రపతి భవన్కు జగన్ వెళ్లారు. భారత రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్ముకు ఆయన అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన ముర్ముకు వైసీపీ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణం చేశాక, తొలిసారిగా ఢిల్లీకి వెళ్లిన జగన్ మర్యాదపూర్వకంగానే ఆమెతో భేటీ అయ్యారు. బహుశా అమిత్ షా అపాయిట్మెంట్ లభిస్తే ఆయనతో భేటీ అయ్యే అవకాశం ఉంది.