CM JAGAN : తెలుగు బూతుల పార్టీ చీఫ్ లో ఆ భయం కనిపిస్తోంది: ఏపీ సీఎం జగన్..!!

  • Written By:
  • Updated On - November 22, 2022 / 02:32 PM IST

టీ.డీ.పీ అంటే తెలుగు బూతుల పార్టీ. టీడీపీని ఇలా మార్చేశారంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పవన్ పార్టీని రౌడీసేనగా మార్చేశారని  తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వీరు గతంలో చేసిన పాపాలను భరించలేకే 2019లో ఎన్నికల్లో చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడికి ప్రజలు గట్టి సమాధానం ఇచ్చారన్నారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జరిగిన పలు అభివృద్ధి, శంకుస్థాపన  కార్యక్రమాల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేనపై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు జగన్.

గత పాలకుల‌కు ఊహించేందుకు కూడా సాహసించని రీతిలో తమ పార్టీ అభివృద్ధి చేసిందన్నారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఎలాంటి పనులు చేయకుండా..నోటికి మాత్రం పని చేబుతున్నారని మండిపడ్డారు. తాము చేస్తున్న అభివృద్ధి పనులను చూసే ప్రజలు త‌మ‌ని ఆశ్వీరదిస్తున్నారన్నారు. చివరకు కుప్పంలోనూ టీడీపీకి చుక్కలు కనిపించాయన్నారు. ఇదేం కర్మరా బాబు అంటూ చంద్రబాబు తలపట్టుకుని కూర్చున్నాడని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ కూడా..ఇలాంటి వ్యక్తికి ఇంట్లో, పార్టీలో ఎందుకు చోటు ఇచ్చానంటూ…ఇదేం కర్మరా బాబు అని అనుకోకుండా ఉంటాడా అంటూ వ్యాఖ్యానించారు.

ఇక ఇప్పుడు చంద్రబాబు కొత్తరాగంతో ప్రజలను భయపెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో గెలిపించకుంటే త‌న‌కు చివరి ఎన్నికల అవుతాయంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో గెలవలేని చంద్రబాబుకు రాష్ట్రంలో ఎలా అధికారంలోకి వస్తామన్న భయం మొదలైందన్నారు. చంద్రబాబు మాట్లాడే ప్రతి మాటలో భయం, వణుకు, నిరాశ కనిపిస్తోందన్నారు జగన్. ఇక దత్తపుత్రుడికి ప్రజల గుండెల్లో స్థానం ఉండదని…మరోసారి తరిమి కొట్టడం ఖాయమన్నారు . తమ ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే..త‌మ‌కు అండగా తోడుగా నిలుస్తాయన్నారు.