వెంకటగిరి నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటించారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం నిధులను ఆయన బటన్నొక్కి విడుదల చేశారు. 80,686 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ. 24,000 చొప్పున ఆర్థికసహాయం అందనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. చేనేత కార్మికుల కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకుంటుందని తెలిపారు. గత ప్రభుత్వంలో చేనేత కార్మికులు నిర్లక్ష్యానికి గురైయ్యారని తెలిపారు. తమ ప్రభుత్వం నవరత్నాలతో పేదలకు మేలు చేస్తోందని తెలిపారు. చేనేత కార్మికులను నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఆయన విమర్శలు చేశారు.
వాతావరణ పరిస్థితులను సైతం లెక్కచేయకుండా నిర్విరామంగా పని చేస్తూ ఇంటింటికీ వెళ్లి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకునే స్వచ్ఛంద సేవకులు వాలంటీర్లని సీఎం జగన్ తెలిపారు. సంస్కారం ఉన్నవారు ఎవరూ వాలంటీర్లను అవమానించరని, కించపరచరని సీఎం జగన్ స్పష్టం చేశారు. వాలంటీర్లను తప్పుగా చిత్రీకరించే కథనాలను మీడియా విభాగం ప్రచురిస్తోందని సీఎం జగన్ విమర్శించారు. ఇటువంటి తప్పుడు ఆరోపణలు ప్రధానంగా మహిళలైన వాలంటీర్ల ప్రతిష్టను దిగజార్చాయని ఆయన సూచించారు. పవన్ కల్యాణ్ పదేళ్లుగా చంద్రబాబుకు వాలంటీర్గా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.