Nandamuri: జగన్ కు ‘నందమూరి’ జై

కృష్ణా జిల్లా నిమ్మకూరులోని నందమూరి కుటుంబం జగన్ ను కలిసింది. ఎన్టీఆర్ పేరును విజయవాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు పెట్టడాన్ని అభినందించారు. ఎన్టీఆర్ బంధువులు , స్నేహితులు, దాయాదుల జగన్ కు ప్రశంసలు అందించారు.

  • Written By:
  • Updated On - February 16, 2022 / 12:28 PM IST

కృష్ణా జిల్లా నిమ్మకూరులోని నందమూరి కుటుంబం జగన్ ను కలిసింది. ఎన్టీఆర్ పేరును విజయవాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు పెట్టడాన్ని అభినందించారు. ఎన్టీఆర్ బంధువులు , స్నేహితులు, దాయాదుల జగన్ కు ప్రశంసలు అందించారు. నందమూరి తారక రామారావు స్వగ్రామం నిమ్మకూరుకు చెందిన ఎన్టీఆర్ బంధువులు, మిత్రులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఆయన క్యాంప్ కార్యాలయంలో సందడి చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సందర్భంగా తమ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని నిమ్మకూరు గ్రామస్తులు కోరారు. అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు నందమూరి తారక రామారావు పేరు పెడతామంటూ పాదయాత్రలో జగన్ ఆనాడు హామీ ఇచ్చాడు. ఆ మేరకు హామీని నెరవేర్చినందుకు నిమ్మకూరులోని నందమూరి కుటుంబీకులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇటీవల వైసీపీ కి చెందిన మంత్రి కొడాలి నాని పాలాభిషేకం చేసి ఆయన మీద ఉన్న భక్తిని చాటుకున్నాడు. పార్టీ పరంగా బీజేపీ కూడా విజయవాడ కేంద్రంగా ఏర్పడే ఎన్టీఆర్ జిల్లాకు స్వాగతం పలికింది. ఆ పార్టీలోని వంగవీటి నరేంద్ర వ్యక్తిగత అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. అంతకు మినహా బీజేపీ ఏకగ్రీవంగా ఎన్టీఆర్ పేరుకు మద్దతు పలికింది. ఇక జిల్లాకు ఎన్టీఆర్ పెట్టిన వైసీపీ ఆ అంశాన్ని వీలున్నంత సానుకూలంగా మలుచుకోవాలి అని భావిస్తుంది. అందుకే వైసీపీ మంత్రిగా ఉన్న కొడాలి ఏకంగా ఎన్టీఆర్ విగ్రహం కు పాలాభిషేకం చేసాడు. నందమూరి కుటుంబం అభిమానిగా కొడాలి చాలా సంతోషంగా ఆ పని చేసాడు. ఇదంతా జగన్ అనుమతి లేకుండా జరగదు. పైగా జిల్లాకు ఎన్టీఆర్ పెట్టడంపై ఇప్పటి వరకు టీడీపీ స్వాగతించ లేదు. అందుకే రాజకీయంగా ఈ అంశాన్ని బాగా హైలైట్ చేయాలి అని వైసీపీ నిర్ణయించిందని తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు కూడా జగన్ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. ఇప్పటి వరకు కమ్మ సామాజిక వర్గం ద్వేషిగా జగన్ ను టీడీపీ టార్గెట్ చేసింది. ఆ సామాజిక వర్గాన్ని బాగా రెచ్చగొట్టింది. చంద్రబాబును వ్యతిరేకించే ఆ సామాజిక వర్గంలోని వాళ్ళు కూడా జగన్ పై మండిపడేలా ప్రచారం చేసింది.

కమ్మ సామాజిక వర్గం ద్వేషిగా జగన్ ను చిత్రీకరణను బలంగా తీసుకెళ్లారు. దీంతో ప్రపంచంలో ఉండే ఆ సామాజిక వర్గం చంద్రబాబు పక్షానికి దాదాపుగా చేరింది. ఇప్పుడు ఎన్టీఆర్ పేరును విజయవాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు పెట్టడంతో కమ్మ సామాజిక పునరాలోచనలో పడేసేలా చేసింది. అందుకే కొడాలి వ్యూహాత్మక అడుగు వేసాడు. పాలాభిషేకం తో ఎన్టీఆర్ విగ్రహాన్ని స్మరించుకుని వైసీపీ వైపు ఆలోచించేలా కమ్మ సామాజిక వర్గాన్ని మలుపు తిప్పే ప్రయత్నం చేశాడు. దివంగత వైఎస్ కూడా ఎన్టీఆర్ పథకాలను ప్రశంసించాడు. పైగా ఆయన బాటలోనే వెలుతున్నామని ఒకానొక సందర్భంలో చెప్పాడు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్న దగ్గుపాటిపురంధరేశ్వరి,వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ బొమ్మను పెట్టుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా అందుకు అంగీకారం తెలిపింది. 2009 ఎన్నికల్లో పలు చోట్ల ఎన్టీఆర్ ను దివంగత వైఎస్ స్మరించుకున్నాడు. ప్రచార వేదికలపై ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చుతున్నాం అంటూ ప్రచారం చేసాడు. ఎన్టీఆర్ కు తెలుగు ప్రజల్లో ఉన్న చరిష్మాను 2009 ఎన్నికల్లో వైఎస్ బాగా అనుకూలంగా మలచుకున్నాడు. అందుకే ఆ ఎన్నికల్లో ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీ దింపింది. ఇప్పుడు ఉన్నది చంద్రబాబు టీడీపీ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కాదని వైఎస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాడు. పైగా 1983లో ఎన్టీఆర్ పెట్టిన కూడు, గుడ్డ, నీడ , విద్య, వైద్యం చుట్టూ వైఎస్ పథకాలను రూపొందించాడు. అందుకే ఎన్టీఆర్ ఆశయాలను తాము నెరవేర్చున్నాం అంటూ అసెంబ్లీలో కూడా చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఆనాడు వైఎస్ చమత్కరించిన సందర్భాలు అనేకం. ఇప్పుడు జగన్ కూడా స్వర్గీయ ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెడుతూ రాజకీయ అనుకూలతను కమ్మ సామాజిక వర్గం నుంచి కోరుకుంటున్నాడు. అధికారికంగా జీఓ విడుదలైన తరువాత కమ్మ సంఘం పెద్దలు కొందరు జగన్ కు సన్మానం కూడా చేయడానికి సిద్దం అవుతున్నారని తెలుస్తుంది.