ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ లో 2024-25 బడ్జెట్ ను రూ.43,402 కోట్లతో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకమైన భాగమని, 62% జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారని మంత్రి తెలిపారు.
భూసార పరీక్షలు పెంచడంపై ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వడం, అలాగే విత్తనాల పంపిణీకి, సూక్ష్మ పోషక ఎరువులు అందించడంపై కూడా ప్రభుత్వం చిత్తశుద్ధిగా పని చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా తక్కువ ధరకే ఎరువులను పంపిణీ చేస్తున్నామన్నారు.
ఈ బడ్జెట్లో ముఖ్యమైన ప్రకటనగా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి ఏడాది రైతులకు రూ.20,000 ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ పథకంలో పీఎం కిసాన్ పథకం (రూ.6,000)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం 14000 తో కలిపి మొత్తం రూ.20,000 ఆర్థిక సహాయం రైతులకు అందుబాటులో ఉంచబడుతుంది. ఈ పథకానికి సంబంధించి రూ.4,500 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అలాగే, భూమిలేని సాగుదారులకు కూడా ప్రతి ఏడాది రూ.20,000 ఆర్థిక సహాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపు చేసింది.
అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయడానికి సంబంధించి విధివిధానాలు మరియు మార్గదర్శకాలపై త్వరలో ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయబడతాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ రుణాల కోసం రూ.2,64,000 కోట్లు (పంట రుణాల కింద రూ.1,66,000 కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు రూ.98,000 కోట్లు) కేటాయించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇప్పటివరకు, పంట రుణాల కింద రూ.1,03,649 కోట్లు మరియు వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలతో సహా వ్యవసాయ టర్మ్ రుణాల కింద రూ.66,148 కోట్లు కలిపి మొత్తం రూ.1,69,797 కోట్లు పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు.
కౌలు రైతులకు కీలకమైన సమాచారం ఇచ్చిన ఆయన, 9.08 లక్షల పంట సాగుదారుల హక్కుల కార్డులను జారీ చేయడం ద్వారా, కౌలు రైతులకు 11 నెలల పాటు పంటపై హక్కులు కల్పించామని చెప్పారు. ఇది వారికి పంట రుణాలు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత పొందేందుకు అవకాశం కల్పించింది. 2024-25 సంవత్సరంలో, CCRCలు పొందిన కౌలు రైతులకు రూ.1,443 కోట్ల పంట రుణాలు పంపిణీ చేసినట్లు మంత్రి వివరించారు.
కౌలుదారుల గుర్తింపు కార్డులు జారీ చేయడానికి, అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు, 2024లో కొత్త సాగుదారుల హక్కుల చట్టం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చట్టం ద్వారా కౌలు దారుల హక్కులు మరింత స్పష్టతతో సమర్ధించబడతాయని ఆయన చెప్పారు.
వడ్డీ లేని పంట రుణాలు మరియు పావలా వడ్డీ రుణాల పథకాలు కోసం 2024-25 సంవత్సరంలో రూ.628 కోట్లు కేటాయించడం, రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గించడం లక్ష్యంగా ఉంటుందని మంత్రి తెలిపారు. రూ.3 లక్షల వరకు పంట రుణాలు తీసుకున్న రైతులకు, ఒక ఏడాది వ్యవధిలో తిరిగి చెల్లించే అర్హత కలిగిన వారికి వడ్డీ లేని రుణాలు మరియు పావలా వడ్డీ పథకంలో వడ్డీ రాయితీ అందించే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
4% వడ్డీ రాయితీని రూ.1 లక్ష వరకు పంట రుణం తీసుకున్న రైతులకు అందించాలని, 1% వడ్డీ రాయితీని రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు పంట రుణం తీసుకున్న రైతులకు అందించాలని ప్రకటించారు.
వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులిలా..
- అన్నదాత సుఖీభవ – రూ.4,500 కోట్లు
- రాయితీ విత్తనాలకు – రూ.240 కోట్లు
- పంటల బీమా – రూ.1,023 కోట్లు
- వ్యవసాయ శాఖ – రూ.8,564.37 కోట్లు
- ఉద్యాన శాఖ – రూ. 3469.47 కోట్లు
- పట్టు పరిశ్రమ – రూ.108.4429 కోట్లు
- వ్యవసాయ మార్కెటింగ్ – రూ.314.80 కోట్లు
- ఉచిత వ్యవసాయ విద్యుత్ – రూ.7241.30 కోట్లు
- ఉపాధి హామీ అనుసంధానం – రూ.5,150కోట్లు
- నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ – రూ.14,637.03 కోట్లు
- భూసార పరీక్షలకు – రూ.38.88 కోట్లు
- విత్తనాల పంపిణీ – రూ.240 కోట్లు
- ఎరువుల సరఫరా – రూ.40 కోట్లు
- పొలం పిలుస్తోంది – రూ.11.31 కోట్లు.
- ప్రకృతి వ్యవసాయం – రూ.422.96 కోట్లు
- డిజిటల్ వ్యవసాయం – రూ.44.77 కోట్లు
- వ్యవసాయ యాంత్రీకరణ – రూ.187.68 కోట్లు
- వడ్డీ లేని రుణాలకు – రూ.628 కోట్లు
- సహకార శాఖ – రూ.308.26కోట్లు
- ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం – రూ.507.038 కోట్లు
- ఉద్యాన విశ్వవిద్యాలయం – రూ.102.227 కోట్లు
- శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం – రూ.171.72 కోట్లు
- మత్స్య విశ్వవిద్యాలయం – రూ.38 కోట్లు
- పశుసంవర్ధక శాఖ – రూ.1,095.71 కోట్లు
- మత్స్య రంగం అభివృద్ధి – రూ.521.34 కోట్లు
- ఎన్టీఆర్ జలసిరి – రూ.50 కోట్లు
- రైతు సేవా కేంద్రాలకు – రూ.26.92 కోట్లు
- ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ – రూ.44.03 కోట్లు