Site icon HashtagU Telugu

SAEL Investment In AP: ఏపీకి మరో భారీ పరిశ్రమ.. ఎస్ఏఈఎల్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ…

Sael Investment In Ap

Sael Investment In Ap

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024కు అంతర్జాతీయ స్థాయిలో సానుకూల స్పందన వస్తోంది. ఈ సందర్భంగా, రాష్ట్రంలో మరో అంతర్జాతీయ పరిశ్రమ పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ, ఏపీలో 1200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రీన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్ నిర్మించడానికి సన్నధమవుతుంది. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టాలని వారు నిర్ణయించారు.

ఇటీవల, ఎస్ఏఈఎల్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో సమావేశం జరిపారు. ఈ భేటీలో సోలార్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి, సోలార్ ప్యానెల్స్ తయారీ రంగం గురించి చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం, ఎస్ఏఈఎల్ సంస్థ ఏపీలో 1200 మెగావాట్ల రెన్యూబల్ ఎనర్జీ కెపాసిటీ ప్రాజెక్టు చేపట్టే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

నారా లోకేష్‌తో ఎస్ఏఈఎల్ ప్రతినిధుల భేటీ:

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, శనివారం ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (SAEL) ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని నారా లోకేష్ ఆయన ఎక్స్ వేదిక ద్వారా వెల్లడించారు. ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్ ఎండీ సుఖ్‌బీర్ సింగ్‌తో జరిగిన భేటీ సమయంలో, ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఏఈఎల్ సంస్థ 1200 మెగావాట్ల రీన్యూబల్ ఎనర్జీ కెపాసిటీ ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టనున్నట్లు ప్రకటించారు. తొలివిడతలో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన క్లీన్ ఎనర్జీ పాలసీ గురించి నారా లోకేష్ మాట్లాడారు. “ఈ పాలసీ అమలు ప్రారంభించిన తర్వాత వస్తున్న తొలి ప్రాజెక్టు ఇదే” అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదే విధంగా, చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్రణాళికపై ఎస్ఏఈఎల్ ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు తెలిపారు. “వ్యవసాయ వ్యర్ధాలను ఉపయోగించి విద్యుత్ తయారు చేసే అంశంపై కూడా ఆలోచనలు చేస్తున్నాం” అని నారా లోకేష్ పేర్కొన్నారు. ఇటీవల, నారా లోకేష్ ఎన్డీబీ బ్యాంక్ ప్రతినిధులతోనూ ఒక భేటీ నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, ఎస్ఏఈఎల్ ప్రతినిధులతో భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రతినిధులతో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో, ఎన్డీబీ బ్యాంక్, ఎస్ఏఈఎల్ ప్రతినిధులు వివిధ అంశాలపై సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపారు.

రెన్యూబుల్ ఎనర్జీ రంగంలో లీడింగ్ కంపెనీలైన ఎస్ఏఈఎల్ ప్రతినిధులతో భేటీ కావడం తనకు ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. “ఏపీలో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద పెట్టుబడుల అవకాశాలను పరిగణనలోకి తీసుకుని చర్చించినా” అంటూ ట్వీట్ చేశారు.