Pawan Kalyan: ఏపీలో గత రెండు నెలలుగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్న అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లపై ఇప్పటికే ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. దీనికీ వారు లొంగకపోవడంతో ఇవాళ్టి నుంచి సమ్మెల ఉన్న అంగన్ వాడీలను విధుల నుంచి తొలగించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. సామరస్యపూర్వకంగా చర్చలు జరపకుండా విధుల నుంచి తొలగించాలంటూ ఆదేశాలు ఇవ్వడం సరికాదు అని అన్నారు.
అలాగే పోలీసు చర్యలకు దిగడం సరైన పద్ధతి కాదన్నారు. సీఎం జగన్కు కోటి సంతకాలతో వినతిపత్రం ఇచ్చేందుకు చలో విజయవాడ కార్యక్రమం చేపడితే అర్ధరాత్రి వేళ పోలీసులు వారిని ఈడ్చి వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. చిన్నపాటి జీతాలతో పని చేస్తున్న వారిపట్ల సానుకూల దృక్పథంతో ఆలోచించాలి’’ అని పవన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎన్నికల హామీలుపై రోడ్డెక్కిన అంగన్వాడీలపై ప్రభుత్వం ప్రతీకార చర్యలు దిగడం దారుణమని అన్నారు.
వైసీపీ ప్రభుత్వం వేధింపులు, కక్ష సాధింపు పద్ధతులను అంగన్వాడీలపైనా ప్రయోగించడం నియంతృత్వ పోకడలకు నిదర్శనమని చెప్పారు. ఇలా అణచివేయడం.. అనైతిక పద్ధతిలో సమ్మెను విచ్చిన్నం చేయడం కంటే పరిష్కారంపై పెడితే ఇప్పటికే ఫలితం వచ్చేదని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ చర్యను ఇతర పార్టీలు ఖండించాయి. కాగా అంగన్ వాడీ ఖాళీల భర్తీ కోసం ఈ నెల 25న నోటిఫికేషన్ రావడం, 26 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది.