వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ కో ఆర్డినేటర్ గా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. 2024 దిశగా వెళుతోన్న జగన్ కు కీలక బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించారు. కేంద్ర పార్టీ కార్యాలయంలోనే ఉంటూ చీఫ్ కో ఆర్డినేటర్ గా ఆయన పని చేయాల్సి ఉంటుంది. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ విభాగాలను సమన్వయం చేసుకునే బాధ్యతలను పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి అప్పగించారు. ఆ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, మీడియా సమన్వయ కర్తగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించారు. పార్టీలో ఇటీవలి పరిణామాలతో విజయసాయిరెడ్డికి అధికారాలు తగ్గిపోయాయనే ఊహాగానాల మధ్య ఈ పరిణామం చోటు చేసుకుంది. గతంలో విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. ఇప్పుడు పార్టీ ప్రాంతీయ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల ఇన్చార్జ్గా నియమితులవడంతో విజయసాయిరెడ్డికి అధికారాలు పునరుద్దరించినట్లయింది.