కలియుగ దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి దర్శనం కోసం ప్రతిఒక్కరూ ఆసక్తి చూపుతుంటారు. స్వామి దర్శనం కోసం భక్తులు ఎంత ఉత్సాహం చూపుతారో.. అంతకంటే ఎక్కువగా విరాళాలు ఇవ్వడానికి ఆసక్తి చూపుతుంటారు. అందుకే టీటీడీకి విరాళాలు వెల్లువెత్తుతుంటాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకు తమ స్థాయికి మించి కానుకలను సమర్పిస్తుంటారు. తాజాగా వేంకటేశ్వరుడికి ఒక్కరోజుకే కోట్ల విరాళం అందింది. వివిధ ట్రస్టులకు వివిధ సంస్థలు ఆదివారం పెద్ద ఎత్తున విరాళాలు అందించాయి. టీటీడీ అధికారుల సమక్షంలో విరాళం చెక్కులను అందజేశారు.
వీరికి ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. హైదరాబాద్కు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ గ్రూప్ యజమానులు వెంకటేశ్వర్లు ప్రసాదరావు, రాజమౌళి ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటి, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు రూ.1.20 కోట్లు, ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.60 లక్షలు విరాళంగా అందజేశారు. హైదరాబాద్ లోని హానర్ హోమ్స్ యజమానులు బాలచంద్ర, స్వప్న కుమార్ లు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.40 లక్షలు విరాళంగా అందజేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డికి కంపెనీ ప్రతినిధులు అందజేశారు.