రాష్ట్రంలో వైద్య విద్యకు ఊతమిచ్చే ఉద్దేశ్యంతో 2022లో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో అదనంగా ఈ ఏడాది 746 సీట్లను పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాల మూడు నెలల్లో మొత్తం 953 మెడికల్ పీజీ సీట్లు పెరిగాయని, 2019 నుంచి మొత్తం సీట్ల సంఖ్య 970 నుంచి నేటికీ 1,923కి చేరుకుందని తెలిపారు. రాష్ట్రంలో సరిపడా బోధనా సిబ్బంది ఉండేలా 106 ప్రొఫెసర్ పోస్టులను సృష్టించి 1,254 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించామని రజనీ తెలిపారు.
రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్యులకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా పీజీ సీట్ల పెంపుదల ఉంటుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. కొత్తగా మంజూరైన 17 కళాశాలలను రూ.8,000 కోట్లతో ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రులను పునరుద్ధరించేందుకు నాడు-నేడు కార్యక్రమం కింద మరో రూ.16,255 కోట్లు వెచ్చించనున్నారు. ఏటా రాష్ట్ర బడ్జెట్లో ఈ రంగానికి రూ.13 వేల కోట్లు కేటాయిస్తున్నారు. ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా పూర్తైతే సుమారు మరో 3 వేల పీజీ సీట్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల రాష్ట్రంలో జనాభాకు అత్యంత నాణ్యమైన వైద్యం ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.