AP PRC: కొత్త పీఆర్సీ పై తగ్గేదెలే..!

ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం సిద్దం అయింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సకాలంలో జీతాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

  • Written By:
  • Updated On - January 31, 2022 / 06:53 PM IST

ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం సిద్దం అయింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సకాలంలో జీతాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పీఆర్సీ జీఓలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా అంశాలపై చర్చించేందుకు సీఎంతో మంత్రుల కమిటీ సమావేశమైంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక శాఖ అధికారులు జగన్‌ను కలిశారు.
అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ జిఒ రాగానే ఫిట్‌మెంట్‌, హెచ్‌ఎస్‌ఎ, ,డిఎతో సహా వేతనాలు చెల్లిస్తామన్నారు. ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ చర్చలకు సంఘాలను ఆహ్వానించిందని తెలిపారు. మూడు రోజులుగా ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఉద్యోగ సంఘాల డిమాండ్‌ మేరకు ప్రభుత్వం ఒకే తేదీన వేతనాలు చెల్లిస్తోందని బొత్స వివరించారు. ఉద్యోగ సంఘాల అభిప్రాయం తెలుసుకోకుండా మంత్రుల కమిటీ సిఫార్సులు ఎలా చేస్తుందని ప్రశ్నించారు.
ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇక్కడి నాయకత్వంపై నమ్మకం లేకపోతే ఎలా అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని కించపరిచేలా మాట్లాడితే పరిణామాలు ఉంటాయని గుర్తుంచుకోవాలన్నారు. బాధ్యతగల వ్యక్తులుగా, రాష్ట్ర ప్రజల సంరక్షకులుగా మంత్రులు ఎక్కడా బాధ్యతారాహిత్య ప్రకటనలు చేయడం లేదు. ‘‘ప్రజలు, ప్రభుత్వం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు తమ డిమాండ్లను బయటపెట్టాలని బొత్స పిలుపునిచ్చారు.