Site icon HashtagU Telugu

CM Jagan: చుక్క‌ల భూముల‌కు జ‌గ‌న్ క్లియరెన్స్

Land Survey

Land Survey

ఏపీ ప్ర‌భుత్వం చేస్తోన్న భూ స‌ర్వేతో ప‌లువురు ఆందోళ‌న చెందుతున్నారు. కానీ, వివాద‌స్ప‌ద భూముల‌పై హ‌క్కులు క‌ల్పించ‌డానికి భూ స‌ర్వే య‌జ్ఞం జ‌రుగుతోంద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెబుతున్నారు. కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ స‌భ‌లోనూ గురువారం అదే చెప్పారు.రాష్ట్రంలో భూసర్వే పేరుతో పెద్ద యజ్ఞం జరుగుతోందని సీఎం చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా రాష్ట్రంలో భూములకు కచ్చితమైన రికార్డులు లేవని అన్నారు. ఉన్న రికార్డులలోనూ కచ్చితమైన వివరాలు లేకపోవడంతో ఇబ్బందులు తప్పట్లేదని వివరించారు. ఈ పరిస్థితుల్లో దాదాపు 22 వేల రైతులకు ప్రయోజనం కలిగేలా ఆధునిక టెక్నాలజీ సాయంతో భూముల సర్వే జ‌రుగుతోందని వెల్లడించారు.

స‌ర్వే కోసం 15 వేల మందికి పైగా సర్వేయర్లను నియమించిందని తెలిపారు. నవంబర్ చివరిలోగా 1500 గ్రామాల్లో భూసర్వే పూర్తిచేసి హద్దులు నిర్ణయిస్తామని సీఎం వెల్ల‌డించారు. వచ్చే ఏడాదికల్లా 17 వేల గ్రామాల్లో సర్వే పూర్తవుతుందని చెప్పారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను డీనోటిఫై చేసి వాటికి క్లియరెన్స్ ఇస్తున్నామని జగన్ చెప్పారు. అవనిగడ్డలో రైతులకు భూమి పట్టాలు పంచి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. చుక్కల, అనాధీన, నిషేధిత జాబితా 22(1)లోని భూములను డీనోటిఫై చేశామని, ఇకపై ఆ భూములపై యజమానులకు సర్వహక్కులు ఉంటాయని జగన్ తెలిపారు. ఇక భూములు అమ్ముకోవచ్చు, బిడ్డల పేరుమీదికి మార్చుకోవచ్చని వివరించారు. గత ప్రభుత్వం 2016 మే నెలలో ఈ భూములను నిషేధిత జాబితాలోకి చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేసిందని సీఎం గుర్తు చేశారు.

Exit mobile version