ప్రభుత్వ శాఖలకు సరఫరా చేసే సిమెంట్ ధరలు తగ్గాయి. జీఎస్టీ 10 శాతం తగ్గడంతో సిమెంట్ బస్తాపై రూ.19 నుంచి రూ.21 వరకు ఆదా కానుంది. ఏపీ నిర్మాణ్ పోర్టల్ ద్వారా కొనుగోళ్లు జరుగుతాయి. విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రవాణా ఖర్చుల వల్ల స్వల్పంగా ధర పెరుగుతుంది. ప్రభుత్వ అవసరాలకు ప్రత్యేక రంగు సంచుల్లో సిమెంట్ సరఫరా చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
- ఏపీలో సిమెంటు ధరలు సవరిస్తూ ఉత్తర్వులు
- ఏపీటీపీసీ సరఫరా చేసే సిమెంటు ధరలు సవరణ
- ప్రభుత్వ శాఖలకు సరఫరా చేసే సిమెంట్ మాత్రమే
ఏపీలో ప్రభుత్వ శాఖలకు సంబంధించి సరఫరా చేసే సిమెంటు ధరలు తగ్గాయి. జీఎస్టీ 10 శాతం తగ్గడంతో సిమెంటు బస్తా ధర కూడా తగ్గింది. ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఏపీటీపీసీ ఈ ధరల తగ్గింపునకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు ఏపీటీపీసీ వీసీఎండీకి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు అందాయి. గతంలో సిమెంటు బస్తాపై 28 శాతం జీఎస్టీ ఉండేది. అయితే జీఎస్టీ కౌన్సిల్ ఈ పన్నును 18 శాతానికి తగ్గించింది. ఈ పన్ను తగ్గింపునకు అనుగుణంగానే సిమెంటు ధరలను ఏపీ ప్రభుత్వం సవరించింది. ఈ కొత్త ధరల ప్రకారం, సిమెంటు బస్తా కనిష్ఠంగా రూ.19, గరిష్ఠంగా రూ.21 వరకు చౌకగా లభించనుంది. ఈ మార్పుల వల్ల ప్రభుత్వ శాఖలకు సిమెంటు కొనుగోళ్లలో కొంతమేర ఆదా అవుతుంది. ఈ సవరించిన ధరల అమలుకు సంబంధించి ఏపీటీపీసీ వీసీఎండీకి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ను నోడల్ ఏజెన్సీగా నియమించి, ఆన్లైన్ సిమెంట్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ఏపీ నిర్మాణ్ ద్వారా సిమెంట్ కొనుగోలుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏపీ నిర్మాణ్ పోర్టల్ ద్వారా ప్రభుత్వ అవసరాల కోసం సిమెంట్ను కొనుగోలు చేస్తారు. దీనివల్ల సిమెంట్ ధరలు తగ్గడంతో ప్రభుత్వానికి ఖర్చు ఆదా అవుతుంది. గతంలో 28 శాతం జీఎస్టీతో రూ.260 ఉన్న పీపీసీ సిమెంట్ బస్తా ఇప్పుడు రూ.240కే లభిస్తుంది. అంటే బస్తాకు రూ.20 ఆదా అవుతుంది.
అయితే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో రవాణా ఖర్చుల కారణంగా బస్తాకు రూ.10 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఈ జిల్లాల్లో పీపీసీ సిమెంట్ బస్తా రూ.250, ఓపీసీ రకం రూ.259, పీఎ్ససీ రకానికి రూ.241 చొప్పున ధర ఉంటుంది. ప్రభుత్వ విభాగాలకు సరఫరా చేసే సిమెంట్ను గుర్తించడానికి, వాటిని ప్రత్యేకంగా ఎరువు రంగు సంచులలో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.
