AP Govt Announces Sankranti Gift To Handloom Weavers సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలోని చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చేనేతలకు ఆప్కో బకాయి పడిన నిధులు విడుదల ప్రారంభించింది. బకాయిల్లో రూ. 5 కోట్లు చేనేత సహకార సంఘాల అకౌంట్లలో సోమవారం (జనవరి 12) జమచేసింది. ఈ విషయాన్ని ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. ఈ సందర్భంగా గత నెలలో కూడా చేనేత సహకార సంఘాలకు బకాయిలు చెల్లించినట్లు మంత్రి గుర్తు చేశారు.
- ఏపీలోని చేనేతలకు గుడ్న్యూస్
- చేనేత సహకార సంఘాల అకౌంట్లోకి డబ్బులు జమ
- రూ. 5 కోట్లు విడుదల చేసిన ఆప్కో
సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలోని నేతన్నలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ (ఆప్కో) బకాయిల్లో భాగంగా.. రూ. 5 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు చేనేత సహకార సంఘాల అకౌంట్లలో సోమవారం (జనవరి 12) డబ్బులు జమ చేస్తున్నట్లు బీసీ సంక్షేమ, ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. ఈ విషయమై సవిత ఆప్కో యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా గత నెలలో (2025 డిసెంబర్) రూ. 2.42 కోట్ల బకాయిలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసినట్లు మంత్రి సవిత గుర్తుచేశారు.
కాగా, ఆప్కో అనేది ఏపీలోని చేనేత కార్మికులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఒక సహకార సంస్థ. విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఆప్కోను 1976లో స్థాపించారు. చేనేత సహకార సంఘాల (సొసైటీ) నుంచి ఆప్కో.. వస్త్రాలు కొనుగోలు చేస్తుంది. అనంతరం వాటిని ఆప్కో.. తన ఔట్లెట్లు, ఆన్లైన్ ద్వారా విక్రయిస్తుంది. అయితే వస్త్రాలు కొనుగోలు చేసిన తర్వాత.. చేనేత సహకార సంఘాలకు ఆప్కో సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో నేతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల సొసైటీలకు ఆప్కో బకాయిలు చెల్లించడం ప్రారంభించింది. అందులో భాగంగా సెప్టెంబర్, డిసెంబర్లో చేనేత సొసైటీల ఖాతాల్లో.. బకాయిలను జమ చేసింది ఆప్కో.
ఇదిలా ఉండగా, చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. అందులో భాగంగానే నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. అంతేకాకుండా పవర్ లూమ్స్ నిర్వాహకులకు కూడా.. నెలకు 500 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ ఇస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా థ్రిఫ్ట్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తోంది ప్రభుత్వం. చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించడానికి.. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలను డోర్ డెలివరీ చేసే ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టింది ప్రభుత్వం.
కాగా, చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ పెంచేందుకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో చేనేత బజార్లను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆప్కో ద్వారా పట్టుచీరలతో పాటు రెడీమేడ్ దుస్తులను కూడా ఆఫ్లైన్, ఆన్లైన్ విక్రయాలు జరుపుతోంది. చేనేత కార్మికులకు అండగా ఉండేందుకు చేనేత వస్త్రాలపై జీఎస్టీని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని గతంలోనే నిర్ణయం తీసుకుంది.
